హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యనేత నేతృత్వంలోని వలస నేతలతో తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధికార కేంద్రంగా మారిదా? పార్టీలో శరవేగంగా తమ పట్టు విస్తరించుకొంటున్నారా? భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలదొక్కుకొనే వ్యూహాన్ని అమలు చేశారా? తనకంటూ ఒక బలమైన వర్గాన్ని నిర్మించుకొన్నారని ఏఐసీసీకి రహస్య సమాచారం అందిందా? ముఖ్యనేత వ్యూహాత్మక ఎత్తుగడలతో ఏఐసీసీ ఇప్పటికే అప్రమత్తమైందా? అందుకే గత నెల రాష్ర్టానికి చెందిన అసలు కాంగ్రెస్ సీనియర్ మంత్రులను రహస్యంగా ఢిల్లీకి పిలిచిందా? తెలంగాణ కాంగ్రెస్లో క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ను కాపాడే బాధ్యత ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ అప్పగించిందా? అంటే గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సమీక్షలు, సంప్రదింపులు, ఫిర్యాదులు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో గత మూడు వారాలుగా తెరముందు కనిపిస్తున్న రాజకీయాల కంటే, తెరవెనుక జరుగుతున్న కసరత్తే ఇప్పుడు అసలు చర్చగా మారింది. రాష్ట్ర కార్యాలయంలో వినిపిస్తున్న నినాదాల కంటే, వార్ రూముల్లో జరుగుతున్న వరుస సమీక్షలే పార్టీ భవిష్యత్తు సమీకరణాలను నిర్దేశించే రాజకీయ సంకేతాలుగా కనిపిస్తున్నాయని గాంధీభవన్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
మీనాక్షి వరుస భేటీలపై జోరుగా చర్చ
మీనాక్షీనటరాజన్ వరుసగా మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఏకాంత సమావేశాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఇవి సాధారణ సమీక్షలు కాదని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించే ప్రక్రియలో భాగమేనని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమావేశాలు ప్రభుత్వ ప్రచారం, లేదా పార్టీ కార్యక్రమాల సమీక్షకే పరిమితం కాలేదు. గ్రామస్థాయిలో క్యాడర్తో నాయకుల అనుబంధం ఎలా ఉన్నది? పార్టీ కోసం నిజంగా పనిచేస్తున్నది ఎవరు? అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది ఎవరు? జిల్లా కమిటీల్లో ఎంతమందికి అసలు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 2022 తర్వాత వలస వచ్చిన వారు ఎందరున్నారు? వారు ఎవరికి విధేయతగా పనిచేస్తున్నారు? పార్టీకి అనుకూలంగా ఉన్నారా? వ్యక్తులకు అనుకూలంగా పని చేస్తున్నారా? వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు సమాచారం.
నాయకులు సమర్పించే నివేదికలకే పరిమితం కాకుండా గ్రామస్థాయి కార్యకర్తల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నది. పార్టీ కోసం కష్టకాలంలో నిలిచిన నాయకులు, కార్యకర్తలు ఎవరు? అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్కు దూరమైన వారు ఎవరు? అనే అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, డీసీసీ అధ్యక్షుడైనా.. అందరికీ ఒకే కొలమానం వర్తిస్తుందన్న సంకేతాలే ఈ సమావేశాల ద్వారా వెలువడుతున్నాయని పార్టీ వర్గాలు పేరొంటున్నాయి. అందుకే మీనాక్షీనటరాజన్ నిర్వహిస్తున్న ఈ వరుస సమీక్షలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కేవలం పరిపాలనా కసరత్తుగా కాకుండా, భవిష్యత్తు సంస్థాగత, రాజకీయ సమీకరణాలను నిర్ణయించే ప్రక్రియగా మారాయనే చర్చ గాంధీభవన్లో జోరుగా సాగుతున్నది.ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, సీనియర్ మంత్రులైన ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు వరుసగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది.
ఏఐసీసీకి రహస్య నివేదిక!
ముఖ్యనేత అసలు కాంగ్రెస్వాదులను పకనబెట్టి, వలస నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏఐసీసీకి రహస్య నివేదిక అందినట్టు తెలిసింది. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురైనా తనకు అనుకూలంగా నిలిచే సొంత వర్గాన్ని బలోపేతం చేసుకొనేందుకే ఆయన ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్న కీలక అంశం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఈ పరిణామాలపై అప్రమత్తమైన ఏఐసీసీ.. తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన ఢిల్లీ దూత మీనాక్షీనటరాజన్కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో పెరిగిన అవకాశవాద రాజకీయ ధోరణులకు కళ్లెం వేసి, కష్టకాలంలో పార్టీతోపాటు నడిచిన సంప్రదాయ కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు.. గాంధీ కుటుంబం, ఏఐసీసీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే సంస్థాగత శక్తిని తిరిగి ముందుకు తీసుకురావాలనే రాజకీయ వ్యూహంతో నివేదికలు రూపొందించి ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది.