హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు అటకెక్కించి.. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండా అన్ని వర్గాలకు మొండి‘చేయి’ చూపిన కాంగ్రెస్ సర్కార్.. వెయ్యి రోజుల పాలనలో అనేక విజయాలు సాధించినట్టు గొప్పలు చెప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ మోసం చేయడమే గాక హైడ్రాను ఎగదోసి పేదలను, 22ఏ నిషేధిత జాబితా పేరుతో సామాన్యుల బతుకులను రోడ్డుకీడ్చిన దుర్మార్గాన్ని మరచి.. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఏవో అద్భుతాలు సృష్టించినట్టు బూటకపు ప్రచారం చేసుకుంటున్నది. సీఎం కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన సాక్షిగా ఈ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోగా, రేవంత్ సర్కార్ తీరుపై జనం చీదరించుకుంటున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలను తమ ఖాతాలో వేసుకోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాడు కేసీఆర్ చొరవతో మెజారిటీ వర్గాలకు చేరువైన అనేక పథకాలను అక్కసుతో నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. ఆ పథకాలను కూడా తామే అద్భుతంగా అమలుచేశామంటూ డబ్బా కొట్టుకున్న తీరు ప్రజలు నవ్వుకుంటున్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పావుల వంతు కూడా ఆచరణలో పెట్టలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రూ.2 లక్షలు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సగం మందిని కూడా రుణవిముక్తి చేయలేదు. మొదట రూ.49వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి చివరకు 20వేల కోట్లు వెచ్చించి చేతులు దులుపుకొన్నది. రైతుభరోసా విషయంలోనూ అదేతీరుగా వ్యవహరించింది. ఏటా మూడు పంటలకు ఇస్తామని ఎన్నికలపుడు ఊదరగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు విడుతలకు గానూ రెండు విడుతలు ఎగ్గొట్టింది. మరోసారి సగం మంది రైతాంగానికి నగదు అందించి మిగిలిన వారికి మొండిచెయ్యి చూపింది. పంటల బోనస్ను పరిహాసంగా మార్చింది. రైతుబీమాకు ఎగనామం పెట్టి సీఎంవో ప్రకటనలో మాత్రం గొప్పగా అమలు చేస్తున్నామని నిస్సిగ్గుగా చెప్పుకొన్నది.
కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాల సాధనకు కార్యాచరణ రూపొందించామని ప్రకటించారు. కానీ కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటి వినియోగంలో ఘారంగా ప్రభుత్వం విఫలమైంది. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా పాలమూరు ప్రాజెక్ట్ను పూర్తిచేయకుండా దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేసింది. కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ కేటాయింపునకు మించి వాడుకున్నా కాంగ్రెస్ సర్కార్ గుడ్లప్పగించి చూసింది తప్ప నిలువరించలేదు. గోదావరి నుంచి ఏపీ పట్టిసీమ ద్వారా నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోకుండా తెలంగాణ రైతులను మోసం చేసింది. మేడిగడ మరమ్మతులో జాప్యం చేసి రైతుల కండ్లల్లో మట్టిగొడుతున్నది. కన్నెపల్లి నుంచి గోదావరి వరద పోతున్నా మోటర్లు ఆన్ చేయకుండా ఏపీకి నీటిని వదిలిపెట్టింది. బీఆర్ఎస్, రైతుల ఒత్తిడికి దిగొచ్చి సమ్మక్క సాగర్ మోటర్లను ఆన్చేసింది. కానీ నిర్లజ్జగా జల వాటాలు సాధిస్తామని చెప్పుకోవడంపై రైతాంగం ఆగ్రహిస్తున్నది.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన మహిళలకు ప్రతినెలా 2,500 ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. కానీ వెయ్యి రోజులైనా ఆ ఊసెత్తడం లేదు. ఇక కల్యాణలక్ష్మి కింద లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని ఆశలు రేకెత్తించింది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని ఎత్తేసే కుట్రలకు తెరలేపింది. కానీ సీఎంవో ప్రకటనలో మాత్రం 1.68 లక్షల మంది లబ్ధిదారులకు ఈ స్కీమ్ను వర్తింపజేశామని చెప్పుకోవడం విస్తుగొలిపింది. సబ్సిడీ గ్యాస్ సగం మందికే వర్తింపజేసింది. పింఛన్ల పెంపు విషయంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నది. వివిధ కారణాలతో వెయ్యి రోజుల్లో సుమారు 2.50 లక్షల మంది లబ్ధిదారులను తొలగించింది. కానీ ఇప్పుడు 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పుకొంటున్న తీరుపై ఆయా వర్గాలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. కొత్త పింఛన్ల మంజూరులో వృద్ధులు, బీడీ కార్మికులను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.