ఊట్కూర్, జూలై 24 : ‘ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు’ అంటూ ప్రచారం చేస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం మంత్రి సిఫార్సు ఉంటేనే ఇల్లు మంజూరవుతుందనే అధికారి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. శుక్రవారం ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పావని అధక్షతన జరిగిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
మొగ్దుంపూర్, కొత్తపల్లి సర్పంచులు తిరుమలేశ్, నర్సింహులు మాట్లాడుతూ.. పూరి గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల పేర్లను అధికారులు తీసుకున్నా.. ఇండ్ల మంజూరులో ఎలాంటి పురోగతి లేదన్నారు. స్పందించిన హౌసింగ్ పీడీ ‘మంత్రి సిఫార్సు ఉంటేనే ఇల్లు మంజూరు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పీడీ తన వ్యాఖ్యలను సవరించి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.