కోహీర్, మే 24: భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని రైతు పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన అన్నదమ్ములు ఖీరురాథోడ్, చందర్ మధ్య భూమి విషయంలో కొంతకాలంగా తగాదా సాగుతున్నది. ధరణిలో ఖీరు పేరున సర్వే నంబర్ 139లో ఉండాల్సిన ఏడు ఎకరాలు కనిపించడం లేదు. మరో సర్వే నంబర్ 140లో కూడా తనకు 10గుంటల భూమి వస్తుందని అతడి అన్న చందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ధరణిలో నుంచి ఏడు ఎకరాల భూమి మాయంకావడం, అన్న కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఖీరూరాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. భూమి విషయంలో పోలీసులతో మాట్లాడాడు. కానీ పోలీసులు తనను వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. భూ వివాదాలను కోర్టులో పరిష్కరించుకోవాలని పోలీసులు వారికి నచ్చజెప్పారు.