కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పేదప్రజలకు కానుకలు అందజేస్తున్నదని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో మంగళవారం క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్లు అందజేసి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై ఎమ్మెల్సీ, చింతా మాట్లాడుతూ లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలు ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా మారిందని, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర సర్కారును ఎదుర్కొనే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్నారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.
– సంగారెడ్డి/ మెదక్, న్యూస్నెట్వర్క్ డిసెంబర్ 20
సంగారెడ్డి, డిసెంబర్ 20: క్రైస్తవులకు బైబిలే భక్తిమార్గం చూపిస్తుందని, ప్రభువు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు అన్నారు. మంగళవారం పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్లో స్థానిక తహసీల్దార్ విజయకుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించి, కానుకల పంపిణీ, విందు భోజనాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్కట్ చేసి క్రిస్మస్ బొమ్మను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అంతకుముందు క్రైస్తవులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ లోక రక్షకుడైన క్రీస్తు చెప్పిన మంచి మాటలను సద్వినియోగం చేసుకుంటేనే శుభం కలుగుతుందన్నారు. దేశ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని చూస్తున్నారన్నారు. అందుకోసం క్రైస్తవ సోదరులు దేవుడిని ప్రార్థించి ప్రధాని పీఠం అధిష్టించేలా కేసీఆర్ కోసం ప్రార్థించాలని ప్రజలను వేడుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ముఖ్యమైన పండుగలను ప్రభుత్వం అధికారికంగా చేస్తూ కానుకలను అందజేస్తున్నదని పేర్కొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ…
– టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
అన్ని రాష్ర్టాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన క్రైస్తవులకు ప్రభుత్వం అధికారికంగా కానుకలను పంపిణీ చేయడంతో పాటు విందు ఏర్పాటు చేస్తోందన్నారు.
ప్రస్తుత బీజేపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను మభ్య పెడుతున్నదని, వాటిని ఎదుర్కొనే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉన్నదన్నారు. అందుకోసం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించాలన్నారు. క్రైస్తవులకు ముందస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇన్చార్జి మైనార్టీ సంక్షేమాధికారి మెంచు నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీలు లావణ్య, తొంట యాదమ్మ, తహసీల్దార్లు విజయలక్ష్మి, ఆశాజ్యోతి, చక్రవర్తి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పాస్టర్లు, క్రైస్తవ బంధువులు తదితరులు పాల్గొన్నారు.