పదో తరగతి పరీక్షల నిర్వహణపై మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు, వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. వెనుకబడిన విద్యార్థుల కోసం నవంబర్ 4 నుంచి మార్చి 10 వరకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం,ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు తరగతులు కొనసాగుతుండగా, జనవరి 18 నుంచి సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు వర్క్స్ , రోజూ వారీ టెస్టులు పెడుతూ స్టూడెంట్స్ నైపుణ్యతా శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. డిసెంబర్ నాటికి 70శాతానికి పైగా సిలబస్ పూర్తవగా, ఈ నెలాఖరు వరకు మొత్తం సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ రెండు వరకు జరుగనున్న ఎగ్జామ్స్ కోసం మెదక్ జిల్లాలో 9500 మంది, సిద్దిపేట జిల్లాలో 13,987 మంది ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 3: పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సమాయత్తం అవుతున్నారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుండడంతో ఇప్పటి నుంచే ఒత్తిడి తట్టుకుని పరీక్షలు రాసేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గతేడాది స్వల్ప తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోయింది. రెండో స్థానం సాధించింది. ఈ సంవత్సరం రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం రావడానికి విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 100 శాతం సిలబస్ పూర్తి చేసి, రివిజన్ ప్రారంభించినట్లు డీఈవో శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 13,987 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 7,036 మంది బాలురు, 6,951 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు 1,661 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 790 మంది బాలురు, 871 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల కోసం సిద్దిపేట జిల్లాలో 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది 14,186 మంది రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 84 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. 2024 మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం ఆరు పేపర్లకు గానూ ఏడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజీ, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థర్డ్ లాంగ్వేజ్, 23న గణితం, 26న ఫిజికల్ సైన్స్, 28న బయో సైన్స్, 30న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు మార్చి 30తో ముగియనున్నాయి. కాగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఒకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. సైన్స్లో రెండు సబ్జెక్ట్లు మినహా మిగతా ఐదు పేపర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పేపర్లు ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు జరగనున్నాయి.
సిద్దిపేట జిల్లా కొన్నేండ్లుగా పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది. మాజీ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిల్లా 2023లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. 2022లో మొదటి స్థానం సాధించింది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను సమన్వయం చేస్తూ, తగు సూచనలు, సలహాలు ఇస్తూ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్రావు విద్యార్థుకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. 2023లో 98.65 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతం పెరిగనప్పటికీ స్వల్ప తేడాతో గతేడాది సిద్దిపేట జిల్లా మొదటి స్థానాన్ని మిస్సైంది. మళ్లీ ఈ సంవత్సరం ప్రథమ స్థానం సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు విద్యాధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఇప్పటికే పదో తరగతి సిలబస్ పూర్తయ్యింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు గంట పాటు ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. జనవరి 2 నుంచి సాయంత్రం పూట ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. సిద్దిపేట జిల్లా మళ్లీ మొదటి స్థానం వచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈసారి కూడా మంచి ఫలితాలు సాధిస్తాం.
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 3: పదో తరగతి వార్షిక ఫలితాలను మెరుగుపరచడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా మెదక్ జిల్లా విద్యా శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నవంబర్ 4 నుంచి మార్చి 10 వరకు సబ్జెక్టుల వారీగా స్పెషల్ తరగతులు నిర్వహిస్తూ నైపుణ్యాన్ని పెంచి ఉత్తమ ఫలితాలు, అత్యధిక మార్కులు సాధించేలా కృషి చేస్తున్నది. డిసెంబర్ మాసం నాటికి 70 శాతానికి పైగా సిలబస్ పూర్తి కాగా, ఈ నెలాఖరు వరకు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. గత విద్యా సంవత్సరం ఫలితాల్లో 90.84 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో నిలువగా, ఈసారి ఉత్తీర్ణత శాతం మరింత పెంచేందుకు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 4వ తేది నుంచి మార్చి 10 వరకు రోజుకో సబ్జెక్టులో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు కొనసాగుతున్న తరగతులను జనవరి 18 నుంచి సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. వంద శాతం మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్స్ ఇస్తూ రోజూ వారీ స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సబ్జెక్టుల వారీగా ప్రీ ఫైనల్ పరీక్షలు చేపట్టనున్నారు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి 9,500 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. సబ్జెక్టుల వారీగా అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సిలబస్ ప్రకారం బోధిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈ నెలలోనే సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి వంద శాతం ఫలితాలు, 10 జీపీఏ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాం. తల్లిదండ్రులు సైతం విద్యార్థులపై దృష్టి సారించాలి.