సమైక్య రాష్ట్రంలో తండాలు, గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో బుధవారం ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి సొంతంగా పరిపాలన చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. గతంలో 263 ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 1,008కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2వేలకు పెంచడంతో వృద్ధులు, దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి గిరిజన తండాకు తారురోడ్డు నిర్మాణం జరిగేలా కృషి చేస్తామన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, పంట రుణమాఫీతో గిరిజన రైతులు సంతోషంగా ఉన్నారని, కల్యాణలక్ష్మి నిరుపేదలకు వరంగా మారిందని పేర్కొన్నారు.
హుస్నాబాద్, అక్టోబర్ 4: ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలు, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, మండలంలోని జిల్లెలగడ్డ గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభోత్సవం, రూ.5కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. అక్కన్నపేట మండలంలోని పలు గిరిజనతండాల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బంజారా ఆత్మీ య సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గిరిజన తండాల రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు కేటాయించారని, 500 జనాభా కలిగి ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా మార్చి సొంతంగా పరిపాలన చేసుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీళ్లు వస్తున్నాయని, 24గంటల ఉచిత విద్యుత్తో పుష్కలంగా పంటలు పండించుకొని గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు.
అర్హులైన గిరిజనులందరికీ ఆసరా పింఛన్లు అందుతున్నాయన్నారు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2వేలకు పెంచడంతో వృద్ధులు, దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారని, ఇదంతా సీఎం కేసీఆర్ చలవేనన్నారు. ప్రతి గిరిజన తండాకు తారురోడ్ల నిర్మాణం జరిగేలా కృషి చేస్తామన్నారు. అక్కన్నపేటకు కొత్తగా మంజూరైన గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రూ.12కోట్లు మంజూరు చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ప్రతియేటా రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. తెలంగాణ రాకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు కేవలం 263 మాత్రమే ఉండేవని, ఇందులో 90వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 1,008గురుకుల పాఠశాలలు స్థాపించడం జరిగిందన్నారు. ఇందులో ఏడు లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 98 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలు స్థాపించారన్నారు.
రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, రుణమాఫీతో గిరిజన రైతులు కూడా సంతోషంగా ఉన్నారని, కల్యాణలక్ష్మి పథకం నిరుపేద గిరిజనులకు వరంలా మారిందన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే సేలాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని, హుస్నాబాద్లో త్వరలోనే సేవాలాల్ దేవాలయం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఎన్నికలప్పుడే తండాలకు వచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయ కులను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక, రాజస్థాన్లో అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని గ్యారంటీల పేరుతో వస్తున్న కాంగ్రెస్ నేతల మాటలు వట్టి బూటకమన్నారు. మూడోసారి సీఎంగా కేసీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించడంలో గిరిజనులందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని 54తండాల్లో పలు తండాలకు రూ.51కోట్లతో తారురోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇంకా కొన్ని తండాలకు త్వరలోనే రోడ్లు వేయిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని 15 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిదంన్నారు. దీంతో గిరిజనులే తమ తండాలను పాలించుకునే అవకాశం వచ్చిం దన్నారు. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్లో రూ.3కోట్లతో బంజారా భవన్ నిర్మాణం కూడా పూర్తి కాబోతన్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులతో గిరిజన తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.
హుస్నాబాద్లో బాలురు, బాలికల గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లు, రెండు కస్తూర్బా పాఠశాలలు, మరో రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.25లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. అక్కన్నపేట మండలానికి మంజూరైన గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి త్వరలోనే ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకులు తండాలకు వచ్చి అసత్య ప్రచారం చేస్తుంటారని, వారి ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మాలోతు లక్ష్మీబీలూనాయక్, కొక్కుల కీర్తిసురేశ్, జక్కుల అనితరమేశ్, జడ్పీటీసీలు భూక్యా మంగశ్రీనివాస్, వంగ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్రామ్రెడ్డి, పెసరు సాంబరాజు, బీలూనాయక్, రామచంద్రంనాయక్, కాసర్ల అశోక్బాబు, లింగాల సాయన్న, పరశురామ్, తిరుపతినాయక్, రమేశ్నాయక్, కందుల రాంరెడ్డి, సత్యంనాయక్, పలు గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు,గిరిజనులు పాల్గొన్నారు.