‘సీఎం సార్ సల్లంగా ఉండాలి.. మా ముసలి వాళ్ళకు కండ్ల పరీక్షలు చేయిస్తండు.. ప్రైవేట్ దవాఖానకు ఎళ్ళితే రెండు నుంచి మూడు వేయిలవుతాయి. మా ఊళ్ళకే డాక్టర్లు అచ్చి కండ్ల పరీక్షలు చేసి అద్దాలిచ్చిండ్రు. చానా ఖుసీగ ఉంది. గిప్పటి వరకు ఏ సర్కారోళ్ళు గిట్ల ఎవ్వలు చేయ్యలె.. కేసీఆర్ సార్ ఫింఛన్ ఇత్తుండు.. కండ్ల పరీక్షలు చేయించవట్టే..ఇంత మంచి సౌలత్ కల్పిస్తున్న కేసీఆర్ సార్కు దండం’.
‘సర్కార్ మంచి సౌలత్ చేసింది.. ఊళ్ళోనే కంటి శిబిరాలు పెట్టి కండ్ల పరీక్షలు చేయడం మా లాంటి వాళ్లకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఫలానా రోజు మీకు కంటి పరీక్షలు చేస్తారని ముందుగాళ్లనే మా ఇంటికచ్చి చెప్పిండ్రు. వాళ్లు చెప్పిన ప్రకారం శిబిరానికి పోయి కంటి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు పరీక్షలు చేసి నాకు అద్దాలు ఇచ్చిండ్రు. సీఎం కేసీఆర్ సార్, మంత్రి హరీశ్రావు సార్లకు రుణపడి ఉంటాం.’ అంటూ ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి విముక్తి లభిస్తున్నది.పండుగ వాతావరణంలో పల్లెలు, మున్సిపల్ వార్డుల్లో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం వైద్యసిబ్బంది శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాల్లో మంచి స్పందన లభిస్తున్నది. మంగళవారం నాటికి కార్యక్రమం 50 రోజులు పూర్తిచేసుకున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తున్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అప్పటికప్పుడు రీడింగ్ అద్దాలు అందజేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ తీసుకుని తయారు చేయించి ఇస్తున్నారు. ఈ కార్యక్రమంతో లక్షలాది మందికి నేత్ర సమస్యలు దూరమై కొత్త కాంతులు పొందారు. ఇప్పటి వరకు చేసిన నేత్ర పరీక్షల్లో మహిళలే ముందున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంధత్వ నివారణకు చేపట్టిన రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. యువత, వృద్ధులు, మహిళలు ఇలా.. అందరూ శిబిరాలకు ఉత్సాహంగా వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన వస్తున్నది. గత 50 రోజులుగా వివిధ గ్రామాలు, పట్టణాల్లోను కంటి పరీక్షలు జరుగుతున్నాయి. శిబిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి నేత్ర పరీక్షలు చేస్తున్నారు. ముందస్తుగానే సమాచారం ఇస్తూ శిబిరాలు నిర్వహిస్తుండడంతో ప్రజలు వినియోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగణంగా ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమం అమలును పరిశీలిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 3,24,121, మెదక్ జిల్లాలో 2,88,646, సంగారెడ్డి జిల్లాలో 7,52,722 మందికి, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ 50 రోజుల్లో 13,65,489 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 881 గ్రామాలు , 251 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తిచేశారు.
సిద్దిపేట జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి హరీశ్రావు కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో 45 బృందాలతో నిర్వహిస్తున్నారు. మంగళవారంతో 50 రోజులు పూర్తయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 257 గ్రామాలు, 83 మున్సిపల్ వార్డుల్లో నేత్ర పరీక్షలు పూర్తి చేశారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,24,121 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. వీరిలో పురుషులు 1,48,745, మహిళలు 1,75,341 మంది, ట్రాన్స్జెండర్లు 20 మంది ఉన్నారు. ఎస్సీలు 54,007, ఎస్టీలు 7,842, బీసీలు 2,23,039, ఓసీలు 32,785 మంది, మైనార్టీలు 6,433 మంది ఉన్నారు. 63,839 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు 31,790 మందికి అందించారు. ఈ కంటి వెలుగు శిబిరాల్లో 2,07,843 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 338 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. 118 మున్సిపల్ వార్డులు పూర్తికాగా, మరో 17 వార్డుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 7,52,722 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో పురుషులు 3,50,872 మంది, మహిళలు 4,01,735 మంది, ట్రాన్స్జెండర్లు 49 మంది ఉన్నారు. ఎస్సీలు 1,19,908 మంది, ఎస్టీలు 46,765, బీసీలు 4,69,710, ఓసీలు 53,429, మైనార్టీలు 62,844 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 62,082 మందికి రీడింగ్ కంటి అద్దాలు అందజేశారు. ఇక ప్రిస్క్రిప్షన్ అద్దాలు 51,741 మందికి అవసరం అని గుర్తించారు. వీరిలో 29,154 మందికి నేరుగా వారి ఇంటికి పంపించారు. ఈ కంటి వెలుగు శిబిరాల్లో ఎలాంటి కంటి సమస్యలు లేవని 6,38,898 మందిని గుర్తించారు.
మెదక్ జిల్లాలో కంటివెలుగు శిబిరాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటి వరకు 286 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. మరో 29 గ్రామాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. 50 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,88,646 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించగా, వీరిలో పురుషులు 1,35,171 మంది, మహిళలు 1,53,410 మంది, ట్రాన్స్జెండర్లు 29 ఉన్నారు. ఎస్సీలు 34,470, ఎస్టీలు 28,510, బీసీలు 2,09,539, ఓసీలు 12,412, మైనార్టీలు 3,679 మంది ఉన్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 33,244 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు 33,091 మందికి అవసరం కాగా, ఇప్పటి వరకు 22,573 మందికి అందించారు. ఈ కంటి వెలుగు శిబిరాల్లో 2,22,306 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను పరిశీలిస్తే మహిళలే అత్యధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 3,24,121 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో పురుషులు 1,48,745 మంది కాగా, మహిళలు 1,75,341 మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2,88,646 మందికి కంటి పరీక్షలను నిర్వహించగా, వీరిలో పురుషులు 1,35,171 మంది, 1,53,410 మంది మహిళలు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 7,52,722 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో పురుషులు 3,50,872 మంది, మహిళలు 4,01,735 మంది ఉన్నారు. ఈ జిల్లాలో కూడా మహిళలే ఎక్కువ. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళలు 7,30,486 మంది, పురుషులు 6,34,788 మంది ఉన్నారు. పురుషుల కంటే 95,698 మంది మహిళలు పరీక్షలు చేయించుకున్నారు.
కండ్లు జర మస్కమస్క ఉంటుండే.. మా ఊరిలో ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేస్తుందని తెలిసింది. కంటి వెలుగు శిబిరానికి వెళ్లా. నా సమస్య డాక్టరమ్మకు చెప్పిన. పరీక్ష చేసి అద్దాలు, మందులు ఇచ్చిండ్రు. అద్దాలు మంచిగా కనిపిస్తున్నాయి. ఊర్లోనే క్యాంపు పెట్టి మాలాంటి వృద్ధులకు మంచిగ చేసిండ్రు.
– మాడ ఈరవ్వ, 15 వార్డు (ఇమంబాద్), సిద్దిపేట
దగ్గరి చూపు ఇబ్బంది ఉందేది. మా ఊరికి డాక్టర్లు వచ్చారని చెప్తే వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని, అద్దాలు తీసుకున్నా. ఇప్పుడు సమస్య తీరింది. ఊర్లో చేసిన ఇదే కంటి పరీక్షలు బయట ప్రైవేట్ దవాఖానల చేయించుకుంటే వేల రూపాయల ఖర్చయ్యేది. సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించి అద్దాలు ఇస్తుండు. ఇంతమంచిగా జనం కోసం పట్టించుకున్న నాయకుడు మునుపెన్నడూ కనిపించలేదు.
– చల్లా హనుమంతారెడ్డి, నర్సాయపల్లి, మద్దూరు మండలం
మా ఇంటికి ఆశ కార్యకర్తలు వచ్చి గ్రామంలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేశామని చెప్పిర్రు. ఆధార్కార్డు తీసుకొని పోగానే, వివరాలు నమోదు చేసుకొని కంటి పరీక్షలు చేసి, దగ్గరి చూపు సరిగ్గా లేదని అద్దాలు ఇచ్చారు. అద్దాలు పెట్టుకొంటే మంచిగా కనుబడుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్ పెట్టిన కంటి వెలుగులో ప్రైవేట్కు వెళ్లలేని నా అటువంటి చాలా మందికి అద్దాలు ఇచ్చిర్రు.
అద్దాలు చాలా బాగున్నాయి.
– శిఖ యాదవ్వ, మర్రిముచ్చాల, కొమురవెల్లి మండలం
వయసు మీద పడ్డప్పటి నుంచి కండ్లు మసక కనిపిస్తున్నాయి. ఎక్కడ చూపించుకుందాం, ఎంత ఖర్చు అయితదో అని భయపడ్డా. సీఎం కేసీఆర్ మా ఊర్లోనే కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయించి పరీక్షలు చేయించారు. మందులు, అద్దాలు ఇచ్చారు. అప్పటి నుంచి కండ్లు మంచిగ కనిపిస్తున్నాయి. నాలాంటి ఎంతో మంది వృద్ధులకు కండ్లద్దాలు ఇప్పిచ్చిన సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– బాలమల్లవ్వ, చాట్టపల్లి, జగదేవ్పూర్ మండలం
ఇప్పటి దాక కండ్లు కనిపించలే. మా ఊర్లో సర్కారోళ్లు కంటివెలుగు టెంటు వేసి కండ్లను చూసిండ్రు. నేను కూడా ఆధార్ కారట్ను పట్టుకొని టెంట్కాడికి పోయిన. కండ్లు కనపడుతలేవని డాక్టర్కు చెప్పిన. కంటి పరీక్ష చేసి కండ్ల అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కండ్లు బాగా కనబడుతున్నయ్. నేను పుట్టి 60 ఏండ్ల దాటినా ఏ సర్కారోళ్లు గిట్ల కంటి అద్దాలను ఉట్టిగా ఇయ్యలే. కేసీయార్ సారూ కంటి పరీక్షలు చేసి కండ్ల అద్దాలు ఉట్టిగనే ఇచ్చిండ్రు. సారు సల్లంగుండాలే. – చిక్కుల సుశీల, తిమ్మానగర్, మెదక్ జిల్లా