మెదక్, జూలై 26 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో నిరంతరంగా వానలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. చెక్డ్యాంలు, చెరువులు, కుంటలన్నీ మత్తళ్లు దూకుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండల్లా తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు పూర్తిగా నిండాయి. వరి నాట్లు వేసుకునే రైతులకు కాలం ఆశాజనకంగా మారింది. దీంతో రైతులు పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.
75 నుంచి 100 శాతం నిండినవి 1216 చెరువులు
జిల్లాలో మొత్తం 2275 చెరువులు ఉన్నాయి. ఇందులో 50 నుంచి 75 శాతం 106 చెరువులు నిండాయి. 75 శాతం నుంచి 100 శాతం వరకు 1216 చెరువులు పూర్తి స్థాయిలో నిండా యి. 953 చెరువులు అలుగులు పారుతున్నాయని ఇరిగేషన్ శా ఖ అధికారులు తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులైన ఘనపూర్, పో చారం, రాయిన్పల్లితోపాటు హల్దీవాగు పొంగి పొర్లుతున్నాయి.
లక్షా 28వేల ఎకరాల్లో వరి నాట్లు
3.10 లక్షల పైచిలుకు ఎకరాల్లో వానకాలం పంటలు సాగవనున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో ఇప్పటికే 1.28 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. చెరువులు, కుంటలు, బావులు, బోరు బావుల్లో పుష్కలంగా నీరు రావడంతో పూర్తిస్థాయి నాట్లకు రైతులు సిద్ధమయ్యారు. మరో వారం రోజులు వర్షాలు కురిస్తే ఆగస్టు మొదటి వారంలోగా వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో 17.8 మి.మీ వర్షపాతం
మెదక్ జిల్లావ్యాప్తంగా 17.8 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా మెదక్లో 48.4 మి.మీ, హవేళీఘనపూర్లో 42.9 మి.మీల వర్షపాతం నమోదైంది. శివ్వంపేట 36.1 మి.మీ, వెల్దుర్తి 30.4 మి.మీ, కొల్చారం 25.2 మి.మీ, కౌడిపల్లి 23.5 మి.మీ, మనోహరాబాద్లో 23.4 మి.మీల వర్షం కురిసింది. అత్యల్పంగా పాపన్నపేటలో 15.7 మి.మీ, నిజాంపేట్ 14.9 మి.మీ, రేగోడ్ 13.6 మి.మీ, పెద్దశంకరంపేట 10.3 మి,మీ, చిన్నశంకరంపేట 10.1 మి.మీ, తూప్రాన్ 10.6 మి.మీ, మాసాయిపేటలో 7.7 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలవనరులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో బుధవారం 477.4 మి.మీటర్ల వర్షం కురిసింది. 16 మండలాల్లో అధికంగా, 10 మండలాల్లో సాధారణకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో సాధారణకంటే తక్కువ వర్షం కురిసింది. గుమ్మడిదల మండలంలో అత్యధికంగా 22.3 మి.మీటర్లు, అత్యల్పంగా న్యాల్కల్ మండలంలో 6.5 మి.మీటర్ల వర్షం కురిసింది. కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్, నారాయణఖేడ్, జిన్నారం, నిజాంపేట మండలాల్లో 10 నుంచి 20 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగితా మండలాల్లో 10 మి.మీటర్ల లోపు వర్షం కురిసింది. వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి 3232 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదతో ప్రాజెక్టు నీటి మట్టం 21.725 టీఎంసీలకు చేరింది. సంగారెడ్డి జిల్లాతో పాటు ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస్తే త్వరలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయి. సిర్గాపూర్లోని నల్లవాగు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 422 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జహీరాబాద్లోని నారింజ వాగు ప్రాజెక్టు వర్షాలతో నిండింది. కోహీర్ మండలం గొటిగార్పల్లి గ్రామంలోని పెద్దవాగు ప్రాజెక్టు వర్షంతో నిండి అలుగు పారుతున్నది. జహీరాబాద్ మండలం మల్చెల్మ గ్రామంలోని ఈరన్నవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారుతున్నది. సదాశివపేట మండలంలోని గంగకత్వ కాల్వ ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
అలుగు పారుతున్న 156 చెరువులు
సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. జిల్లాలో మొత్తం 1374 చెరువులు ఉండగా వీటిలో 156 చెరువులు అలుగు పారుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్ పరిధిలో 1087 చెరువులు ఉండగా 123 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జహీరాబాద్ డివిజన్లోని 13 చెరువులు, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో 20 చెరువులు అలుగు పారుతున్నాయి. జిల్లాలో 134 చెరువులు వందశాతం నిండాయి. 769 చెరువుల్లోకి 75 శాతం, 291 చెరువుల 50 శాతం నీటితో నిండాయి.
నల్లవాగుకు జలకళ
మండలంలోని నల్లవాగు మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ స్థాయిలో వరద ప్రవాహంతో ఈ జలాశయం నిండి, అలుగు పారుతున్నది. ప్రాజెక్టు పూర్తి లెవల్ 1493/ 1493.50 అడుగులకు నీటి మట్టం నిల్వ ఉన్నదని ప్రాజెక్టు డీఈఈ పవన్కుమార్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 422 క్యూసెక్కులు వరద రాగా, 66 క్యూసెక్కులు అలుగు ద్వారా దిగువ మంజీరా నది వైపు విడుదల చేశారు.
ప్రమాదపుటంచున ఎర్రచెరువు
భారీ వానలకు ఎర్రచెరువు ప్రమాదపుటంచుల్లో ఉన్నది. ఎప్పుడు కట్ట తెగి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో నెలకొన్నది. గుమ్మడిదలలోని ఎర్రచెరువు వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది. గతేడాదిలో ఎర్రచెరువు కట్ట మీటరు లోతులో కుంగి ప్రమాదకరంగా మారింది. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులతో చర్చించగా రూ.16 లక్షలతో కట్టకు మరమ్మతులు చేశారు. ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలకు ఆ కట్ట మళ్లీ ప్రమాదకర స్థితికి చేరింది. దీంతో బుధవారం జడ్పీటీసీ కుమార్గౌడ్, సర్పంచ్ చిమ్ముల నర్సింహరెడ్డి, పాలకులతో కలిసి కట్టను పరిశీలించారు. మిషన్ కాకతీయ డీఈ రవీందర్తో మాట్లాడి ఎర్రచెరువు కట్ట పరిస్థితిని వివరించారు. త్వరగా మరమ్మతులు చేయిస్తానని డీఈ తెలిపినట్లు వారు చెప్పారు. వీరితో ఉప సర్పంచ్ మొగులయ్య, నాయకులు రవీందర్రెడ్డి, రాము, జై పాల్రెడ్డి, ఆకుల సత్యనారాయణ, ఆంజనేయులు ఉన్నారు.
హల్దీవాగులో నీడిల్ ఫిష్ లభ్యం
మెదక్ జిల్లా హల్దీవాగుపైనున్న వెల్దుర్తి చెక్డ్యాం వద్ద మత్స్యకారులు చేపలు పడుతుండగా నీడిల్ ఫిష్ లభ్యమైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి చేప ఇక్కడ చూడలేదని మత్య్సకారులు ఆశ్చర్యపోయారు. ఈ చేపకు పొడవాటి నోరు, పదునైన పళ్లు ఉన్నాయి. ఈ రకం చేపలు సముద్ర తీర ప్రాంతాలు, నదుల్లో మాత్రమే దొరుకుతాయి. హల్దీవాగులో లభ్యం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇతర జాతులకు చెందిన చేప పిల్లలను తింటూ జీవిస్తుందని, కాళేశ్వరం జలాలు వదిలినప్పుడు ఈ చేప నీటిలో రావచ్చని గ్రామస్తులు తెలిపారు.
కరెంట్తో జరపైలం
పటాన్చెరు, జూలై 26: వానకాలం కరెంట్తో జరపైలంగా ఉండాలి. వారం రోజులుగా కు రుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వర్షం చాటున కొన్ని ప్రమాదాలు కూడా పొం చి ఉన్నాయి. వాటిలో కరెంట్ షాక్ ఒకటి. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా.. ప్రాణాలకే ముప్పు రావచ్చు. విద్యుత్ ఎంత ప్రయోజకరియో.. నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకారి కూడా.