వానకాలం ధాన్యం కొనుగోలుకు మెదక్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ సీజన్లో మొత్తం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించే లక్ష్యానికి ప్రణాళికలు రూపొందించారు. మెదక్ జిల్లాలో వానకాలంలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 5 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
మెదక్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మెదక్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ సీజన్లో మొత్తం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించే లక్ష్యానికి ప్రణాళికలు రూపొందించారు. మెదక్ జిల్లాలో వానకాలంలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 5 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
జిల్లావ్యాప్తంగా 392 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 103, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 272, డీసీఎంఎస్ 10, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు టార్ఫాలిన్లు సరఫరా చేస్తున్నారు. కేంద్రాల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేస్తారు. దీంతో రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ అవుతుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలు ఏర్పాటు చేస్తున్నారు. లారీల్లోని ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లుల్లో అన్ లోడింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 392 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా 142 లక్షల గన్నీ బస్తాలు అవసరం ఉన్నాయి. ఇప్పటికే 40 లక్షల గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచారు. రెండు మూడు రోజుల్లో మరో 20 లక్షల గన్నీ బస్తాలు రానున్నాయి. 50 లక్షల బస్తాలకు ఆర్డర్ ఇచ్చారు. మరో 20 లక్షల గన్నీ బస్తాలు రైస్ మిల్లుల వద్ద ఉన్నాయి. జిల్లాలో 156 రైస్ మిల్లులు ఉండగా, అందులో నాలుగు రైస్మిల్లులపై కేసులు నమోదయ్యాయి. 7 కోట్ల ధాన్యం కమీషన్ విడుదలయ్యింది. ఇందులో పీఏసీఎస్కు రూ.5 కోట్ల 18 లక్షలు, డీసీఎంఎస్కు రూ.24 లక్షలు, ఐకేపీకి కోటి 43 లక్షలు, ఎఫ్పీవోకు రూ.10 లక్షలు విడుదలయ్యాయి. ఇంకా రూ.3 కోట్లు రావాల్సి ఉంది.
ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం రైతుల వద్ద నుంచి ఏ గ్రేడ్ ధాన్యం ధర క్వింటాల్కు రూ.2203గా, సాధారణ రకానికి రూ.2183 ధరగా నిర్ణయించారు. దీంతో రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తరలించనున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తొందరగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
మెదక్ జిల్లావ్యాప్తంగా 392 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. బుధవారం జిల్లాలో 10కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మండల స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుడుతాం.
కొల్చారం, అక్టోబర్ 25: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కౌడిపల్లి ఏడీఏ సత్యవతి అన్నారు. కొల్చారం మండలంలోని కొంగోడు, నాయిన్ జలాల్పూర్, సంగాయిపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మహ్మద్ గఫార్మియా, ఎంపీడీవో గణేశ్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సౌలభ్యం కోసమే ప్రభుత్వం గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఈవో సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృపాకర్రెడ్డి, మంజీరా రైతు సంఘం చైర్మన్ జితేందర్రెడ్డి, డైరెక్టర్లు, ఏఈవోలు వినీతాభవానీ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ అర్బన్, అక్టోబర్ 25: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే రైతులు నిబంధన ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలుకు అన్ని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి సెంటర్లో ప్యాడి క్లీనర్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్పోర్టు లారీల ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సెంటర్లో 22 వేల కింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తున్నందున రైతులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల సమస్య తీర్చడానికి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 24 గంటలు అందుబాటులో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. రైతులు కేవలం లారీల కోసం కంట్రోల్ రూం నెం 9281103684 కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.