వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఏటా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. మద్దతు ధరతో ధాన్యం సేకరించి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నది. ప్రభుత్వ చేయూతతో జిల్లాలో ఈ వానకాలంలో 3.78 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 9,57,375 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతుల అవసరాలకు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లు పోగా.. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి పక్కాగా సేకరణ పూర్తిచేయనున్నారు.
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 26 : వానకాలం ధాన్యం సేకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే జిల్లా అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఇందుకోసం జిల్లాలోని రైస్మిల్లర్లు, సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి ధాన్యం సేకరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగినందున కొనుగోలు కేంద్రాల సంఖ్యను అధికారులు పెంచనున్నారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో సుమారు 3.78 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 9,57,375 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతుల అవసరాలకు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లు పోగా.. సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 420 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు. గత వానకాలం సీజన్లో 411 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈసారి 420 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. క్వింటాల్ ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.2203, బీ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,183 మద్దతు ధర రైతులకు చెల్లించనున్నారు.
జిల్లావ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రారంభం కానుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్, మాయిశ్చర్ మీటర్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచనున్నారు. రైతుల కోసం తాగునీరు, నీడ, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు అధికారులు ఆదేశించారు. వీటితోపాటు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ధాన్యం నిల్వ కోసం మరిన్ని గోడౌన్లను గుర్తించి ఉపయోగించాలని సూచించారు. పక్కాగా ధాన్యం సేకరణ చేపట్టాలని యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు.