మెదక్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సమ్మక సారలమ్మ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఏడుపాయల్లో జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి చేస్తున్నారు. జాతర నిర్వహణకు ఏటా సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో నిర్వహించే జాతరకు సీఎం కేసీఆర్ రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పండుగలు, జాతరలను వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఏడుపాయల జాతరకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించి ఏటా రూ.కోటి మంజూరు చేసేవారన్నారు. ఈ సారి జాతరకు రూ.రెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, జిల్లా మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మహాశివరాత్రి జాతరను వైభవంగా నిర్వహిస్తామన్నారు.