సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 16 : సంక్రాంతి పండగ సందర్భంగా కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమానికి అర్జీల సంఖ్య తగ్గింది. ప్రతివారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్కు 13 అర్జీలు మాత్రమే అందాయి. ఆయా అర్జీలను స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ శరత్ వాటిని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ అర్జీలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
త్వరగా పరిష్కరించాలి
సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి
సిద్దిపేట రూరల్,జనవరి16 : ప్రజావాణి వినతులపై ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజవాణిలో భాగంగా ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన అర్జీలను ఆయాశాఖల వారీగా విభజించి సత్వరం పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్లో..
మెదక్ అర్బన్, జనవరి 16 : అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని తగు సూచనలు చేశారు. శివ్వంపేట మండలం బీజీలిపూర్ గ్రామానికి చెందిన హుస్సేన్ మేము ఇద్దరం అన్నదమ్ములమని తన గ్రామ శివారులో వారసత్వంగా 3 ఎకరాల 36గుంటల భూమి వచ్చిందని కానీ ఆట్టి భూమిలో వేరే వాళ్లు అక్రమంగా ప్రవేశించి కడీలు పాతారని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్ట ప్రకారం ఫిర్యాదీకి తగిన న్యాయం చేయాలని శివంపేట ఎస్సైకి సూచనలు చేశారు. మెదక్ పట్టణానికి చెందిన డాక్టర్ యస్.మధుసూదన్రావు పొత్తులో ఉన్న స్థలాన్ని ఇటీవల విక్రయించాడు. అవకతవకలు జరిగి చెక్బౌన్స్ అయ్యి ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కారానికి మెద క్ డీఎస్పీకి సూచించారు.