రైతులు మొగులుకు ముఖం పెట్టి చూసే రోజులు పోయాయి. కాలం కాకున్నా జిల్లా రైతులకు కాళేశ్వరం నీళ్లతో పంటలు పండించుకునే భాగ్యాన్ని అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగుచేస్తున్నారు. ఎక్కడో ఉన్న గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి జిల్లా రిజర్వాయర్లకు తరలివస్తున్నాయి. దీంతో భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయి. వానలు లేకపోయినా రిజర్వాయర్ల ద్వారా చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నింపి రైతుల పంటలు పండించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సిద్ధం చేసింది. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను కాళేశ్వరం నీళ్లతో నింపుతున్నారు. ఇటీవల ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నీటి పారుదలశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కాల్వలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు మొఖాన్ని మొగులుకుపెట్టి చూసే రోజులు పోయాయి.. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో రైతులు పంటలు పండించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ధైర్యం ప్రతి రైతులో కనిపిస్తున్నది. వానలు లేకపోయినా రిజర్వాయర్ల ద్వారా చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నింపి రైతుల పంటలు పండించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సిద్ధం చేసింది. ప్రస్తుతం వర్షాలు ఆలస్యం కావడంతో వానకాలం పంటలకు ఇబ్బందులు తలెత్తవద్దని చెప్పి జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను కాళేశ్వరం నీళ్లతో నింపి వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడానికి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఇటీవల ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు వచ్చి చేరి నిండుకుండను తలపిస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో కాల్వలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి ఒక్కో పంపు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సాగు నీరందించేలా రిజర్వాయర్లలో నీటిని నింపారు.
జిల్లాలోని రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుకుండలా ఉన్నాయి. కాలం కాకపోయినా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వర్షాలు ఆలస్యం కావడంతో సాగు కూడా కొంత ఆలస్యమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని రిజర్వాయర్లను కాళేశ్వరం నీటితో నింపిపెడుతున్నారు. వానకాలం సాగు పంటలకు నీటిని విడుదల చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కాల్వలను పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా..? ఏమేమి చేయాలి..? ఏ మేరకు నీటిని విడుదల చేయాలి..? ఎన్ని చెక్డ్యామ్లు ఉన్నాయి..? ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది…? తదితర వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేసిన నివేదికలను సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు నివేదించనున్నారు. ఆదేశాల రాగానే నీటిని విడుదల చేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరం జలాశయం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి ప్రస్తుతం ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు ప్రస్తుతం 2.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ప్రస్తుతం ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు ప్రస్తుతం 2.5 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి.. అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు వెళ్తాయి. ఇటీవలే అన్ని రిజర్వాయర్లను నింపడంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఈ రిజర్వాయర్లో 10.5 టీఎంసీలు, కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.8 టీఎంసీలు నీళ్లు వచ్చి చేరాయి. దీంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానలు లేక పోయినా రిజర్వాయర్లతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నింపి రైతుల పంటలను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందులో భాగంగానే జిల్లాలోని రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బెజ్జంకి మండలం, రంగనాయకసాగర్ రిజర్వాయర్ సిద్దిపేట నియోజకవర్గంతో పాటు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దుబ్బాక నియోజకవర్గం, కూడవెల్లి వాగు, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు సాగు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లాతో పాటు పూర్వపు నిజామాబాద్ జిల్లాకు కూడా ఇక్కడి నుంచే సాగు నీటిని కొంత మేర అందిస్తారు. హల్దీవాగు నుంచి పలు చెక్డ్యామ్లు నింపుకొంటూ నిజాంసాగర్లో కలుస్తున్నది. కూడవెల్లివాగు గుండా పలు చెక్డ్యామ్లు నింపుకొంటూ నర్మాల చెరువును నింపుతాయి. ఇలా పక్కాగా వానకాలం సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయడానికి జిల్లాలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపారు. ఇటీవలే గౌరవెల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలు వచ్చి చేరాయి. ఈ రిజర్వాయర్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగు నీటిని అందిస్తారు. ఇక చేర్యాల ప్రాంతానికి దేవాదుల ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి సాగు నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.