సిద్దిపేట అర్బన్/సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మార్చి 17: పదోతరగతి పరీక్షలకు వేళయ్యింది. నేటినుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. నిమిషం నిబంధన ఏమీ ఉండదని, ఉదయం 9.35 వరకు విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈసారి పదో తరగతి పరీక్షల్లో 7 పేపర్లు ఉండనున్నాయి. గతేడాది 6 పేపర్లు మాత్రమే ఉండగా.. ఈసారి 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పేపర్లు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు జరగనుండగా.. మిగతా పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.
పరీక్షల సజావుగా జరిగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నాపత్రం రిలీజ్ చేసి, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రంలో కచ్చితంగా విద్యుత్ సౌకర్యం కల్పించి ఫ్యాన్లు, చల్లని తాగునీరు, టాయిలెట్, ఫర్నిఛర్, ట్యూబ్ లైట్ లాంటి కనీస సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పరీక్షా కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, ఆశవర్కర్ అందుబాటులో ఉండడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు చీటీలు తీసుకు రావద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ను వెంట తీసుకురావాలని సూచించారు. హాల్ టికెట్లు అందని, వాటిని పోగొట్టుకున్న విద్యార్థులు www.bse.telanagana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా లేదా సిబ్బంది ప్రోత్సహించినా 25/97 చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 448 పాఠశాలల నుంచి 13,987 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలురు 7,036 మంది, 6,951 మంది బాలికలు ఉన్నారు. ఆరుగురు ప్రైవేటు విద్యార్థులు ఉండగా.. 1,661 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. 80 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 80 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి 20 మంది విద్యార్థులు ఒక ఇన్విజిలేటర్ను నియమించడంతో పాటు పరీక్షలు పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు 5 ఫ్లయింగ్ స్కాడ్స్ టీమ్లు, 7 రూట్ ఆఫీసర్లు, 7 అడిషనల్ రూట్ ఆఫీసర్లను, 46 మంది జాయింట్ కస్టోడియన్లను నియమించారు. 23 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 121 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది 118 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది మరో 3 పరీక్షా కేంద్రాలను పెంచారు. మొత్తం 22,069 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.121 మంది సిట్టింగ్ స్కాడ్లతో పాటు 5 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. 121 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 121 మంది డిపార్ట్మెంటల్ అధికారులు(డీవో)లు విధులు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద మండల విద్యాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్ల ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు డీఈవో సూచించారు.
మెదక్ జిల్లాలో 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,300 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 5,079 మంది బాలురు, 5,221 మంది బాలికలు ఉన్నారు. 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్టుమెంట్ అధికారులు, 600 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 3 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, 3 సిట్టింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్షా కేంద్రంలోకి ఎవరికీ సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నాపత్రం రీలీజ్ చేస్తాం. ప్రతి విద్యార్థి 12.30 గంటల వరకు పరీక్షా కేంద్రంలో ఉండాలి. హాల్టికెట్పై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకొని ప్రశాంతంగా పరీక్ష రాయాలి.
– శ్రీనివాస్రెడ్డి, సిద్దిపేట డీఈవో
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ది బెస్ట్. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులు నిర్భయంగా పరీక్ష రాయాలి. జిల్లాలో మొత్తం 121 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడితే చర్యలు తప్పవు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
-వల్లూరు క్రాంతి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్
విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులను మాత్రమే కేటాయించాం. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరీక్షలు సజావుగా నిర్వహిస్తాం.
-రాధాకిషన్, మెదక్ డీఈవో