ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టి కోట్లాది రూపాయలతో లక్షన్నర కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి ఇంటింటికీ తాగునీరందిస్తున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్.’ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మాట్లాడుతూ గడపగడపకూ శుద్ధి చేసిన జలాలు అందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కాపాడారన్నారు. భూగర్భజలాలు పెరిగాయని, ఎండిపోయిన బోర్లలో మళ్లీ నీళ్లు ఉబికివస్తున్నాయన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. పలుచోట్ల మహిళలు నిండు బిందెలతో ర్యాలీలు తీశారు. మిషన్ భగీరథ నీటి ట్యాంకులను మామిడితోరణాలు, పూలతో అలంకరించి, ముగ్గులు వేసి సందడి చేశారు.
-మెదక్/ సంగారెడ్డి, న్యూస్నెట్వర్క్, జూన్ 18రామచంద్రాపురం, జూన్ 18: మిషన్ భగీరథ లాంటి మహత్తరమైన పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని అందించి అపర భగీరథుడిగా సీఎం కేసీఆర్ నిలిచారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీ గార్డెన్స్లో నీటి పండుగ ఉత్సవాలను నిర్వహించారు. వాటర్స్ వర్క్స్ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో బిందెడు మంచి నీటి కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితులు ఉండేదన్నారు. ఇప్పుడు ఇంట్లో పొయ్యి కాడికే మంచి నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తాగునీరు లేని గ్రామాలకు ఆడపిల్లను ఇచ్చే పరిస్థితి ఉండేదికాదన్నారు. అలాంటి పరిస్థితులను అధిగమించి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు. దేశంలోనే మొదటిసారి రూ.43,791 కోట్లతో 1.30లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్ సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిందన్నారు.
రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించిందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు మిషన్ భగీరథ పథకం వరంలా మారిందన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం ఉచితంగా 20 వేల లీటర్ల మంచినీటిని అందజేస్తున్నదన్నారు. పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్లు అందజేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
అనంతరం వాటర్వర్క్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, మెట్టు కుమార్యాదవ్, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, బొల్లారం చైర్పర్సన్ రోజాబాల్రెడ్డి, ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, జలమండలి రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్, జనరల్ మేనేజర్ నారాయణ, నాయకులు పాల్గొన్నారు.