మెదక్ మున్సిపాలిటీ, జూలై 19 : విద్యుత్ అధికారుల పనితీరు సరిగా లేదని.. గౌరవ సభ్యులు సమస్యలను మీ దృష్టికి తెచ్చినా ఎందుకు స్పందించరని ఇలాగైతే విద్యుత్ సమస్యలు ఎలా తీరుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మండి పడ్డారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై రేగోడ్, పెద్ద శంకరంపేట, టేక్మాల్ జడ్పీటీసీలు యాదగిరి, విజయరామరాజు, సరోజ, కో-ఆప్షన్ సభ్యు డు మహ్మద్ యూసుఫ్ మాట్లాడారు. విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా పరిష్కారించడం లేదని, పల్లెప్రగతిలో సైతం సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదంటూ సమావేశం దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే స్పందించి అధికారులు తీరు మార్చుకోవాలని సమస్యలను వెంటనే పరిష్కారించేలా ఎస్ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. కట్టె లు పాతి విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వాటిని తొలిగించి స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు.
ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. జిల్లాలో మిగిలిపోయిన సబ్స్టేషన్ల పనులు త్వరగా పూర్తిచేయాలని, పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఎస్ఈ జానకిరామ్కు సూచించారు. మెదక్ నియోజకవర్గంలోని తండాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారించాలన్నారు. హవేళీఘనపూర్ మండలంలో పలు గ్రామాల్లో 11 కేవీ విద్యుత్ తీగలు ఇండ్లపై ఉన్నందున వెంటనే తొలిగించాలని, అంతేగాకుండా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే విద్యుత్ సమస్యలు తలెత్తవని జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. నిజాంపేట మండలంలో రైతులకు పాస్ పుస్తకాలు రాకపోవడంతో రైతు బీమా, రైతుబంధు ప్రయోజనాలు అందడం లేదని, ఇటీవల రైతు మృతి చెందడంతో రైతు కుటుంబం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్ సమావేశం దృష్టికి తెచ్చారు. వెంటనే ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి జోక్యం చేసుకొని రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందలేకపోతున్నాయని ఇలాంటివి పునరావృతం కాకుండాచర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి : కలెక్టర్
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిశుభ్రత పెరిగి జిల్లాలో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని అయినా, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. కరోనా సోకినా వారిని జిల్లా కేంద్రంలోని దవాఖానకు పంపిస్తే నిర్లక్ష్యం వహిస్తూ ప్రైవేట్ దవాఖానలకు తీసుకెళ్లండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆదనపు కలెక్టర్లు రమేశ్ కుమార్, ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో శైలేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతి చంద్రగౌడ్, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయధికారి పరశురాం నాయక్ ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు మంజూరైన బ్యాటరీ మోపేడ్(బ్యాటరీ రిక్షా)లను దివ్యాంగులకు అందజేశారు.