హుస్నాబాద్, ఫిబ్రవరి 18: వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు 67 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జాతర బస్సుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. పురుషుల్లో పెద్దలకు రూ.350లు, చిన్నారులకు రూ.190 టికెట్ ధర ఉందన్నారు. హుస్నాబాద్ బస్టాం డ్ నుంచి నేరుగా మేడారం జాతరలో అమ్మవారి గద్దెలకు అతిసమీపంలో భక్తులను దించుతామన్నారు.
రోజుకు కనీసం 5 వేల మంది భక్తులను తరలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బస్టాండ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మెడికల్ క్యాంపు, తాగునీటి సౌకర్యం, పోలీసు బందోబస్తు సౌకర్యాలు కల్పించామన్నారు. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదం ఇంటికే పంపించే ఏర్పా ట్లు చేశామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిపో ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.