సంగారెడ్డి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. రెండు నెలలుగా జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాయి. దీంతో వ్యవసాయబోరు బావులు, తాగునీటి బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. దీంతో రైతులు, ప్రజల్లో సంతోషం కనిపిస్తున్నది. ముఖ్యంగా బోరుబావులు ఉన్న రైతులు పంటలకు సరిపడా సాగునీరు అందుతుందని ఆనంద పడుతున్నారు. భూగర్భ జలాల శాఖ సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 12.13 మీటర్ల సాధారణ స్థాయిలో భూగర్భ జలాలున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 6.38 మీటర్ల పైకి భూగర్భజలాలు వచ్చాయి. గతేడాది ఆగస్టు మాసంలో 18.51 మీటర్ల సాధారణ స్థాయిలో భూగర్భ జలాలుండగా, ఈ ఏడాది భూగర్భ జలాలు 12.13 మీటర్ల పైకి వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధికంగా ఝరాసంగం మండలంలో 3.52 మీటర్ల లోతులోనే ఉన్నాయి. ఇక సంగారెడ్డి మండలంలో భూగర్భ జల మట్టాలు లోతుకు పడిపోతున్నాయి. జిల్లాలోనే అత్యంత కిందికి 33.29 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. అమీన్పూర్ మండలంలో 4.81 మీటర్లు, అందోలు 10.14 మీటర్లు, చౌటకూరు 17.59 మీటర్లు, గుమ్మడిదలలో 18.47 మీటర్లు, హత్నూరలో 19.91 మీటర్లు, ఝరాసంగంలో 3.52 మీటర్లలో ఉన్నాయి. జిన్నారం మండలంలో 12.49 మీటర్లు, కల్హేర్లో 10.72 మీటర్లు, కందిలో 9.02 మీటర్లు, కంగ్టి 13.15 మీటర్లు, కోహీర్ 12.24 మీటర్లు, కొండాపూర్ 24.71 మీటర్లలో భూగర్భ జలాలున్నాయి.
మనూరు మండలంలో 5.97 మీటర్లు, మొగుడంపల్లిలో 8.61, మునిపల్లిలో 7.48, నాగల్గిద్దలో 9.68, నారాయణఖేడ్లో 3.81, న్యాల్కల్లో 14.31 మీటర్లపైకి భూగర్భ జలాలు చేరుకున్నాయి. పటాన్చెరు మండలంలో 12.92 మీటర్లు, పుల్కల్లో 7.83, రాయికోడ్లో 7.66, రామచంద్రాపురంలో 15.76, సదాశివపేటలో 10.20, సంగారెడ్డిలో 33.29, సిర్గాపూర్లో 9.33, వట్పల్లిలో 4.13, జహీరాబాద్లో 15.67 మీటర్లలో భూగర్భ జలాలున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత పైకి చేరుకునే అవకాశముంది. భూగర్భ జలాలు ఎంత పైకి వస్తే, రైతులకు అంతమేలు జరుగుతుంది. వానకాలం సీజన్లో రైతులు బోరుబావుల కింద ఎక్కువగా వరి, చెరుకు, కూరగాయలు సాగు చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు పెరుగుతుండంతో పంటలకు సాగునీరు సమృద్ధిగా అందించవచ్చు. దీంతో భూగర్భ జలమట్టాలు పైకి వస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికోసం ప్రజలు బోరుబావులను వాడుతున్నారు. తాగునీటి బోరుబావుల్లో సైతం భూగర్భ జలాలు పెరుగుతుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు పూర్తిగా నిండటంతో భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు వర్షంనీరు వృథా చేయకుండా ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించే ప్రయత్నం చేస్తే భూగర్భ జలమట్టాలు పెరిగి సాగు, తాగునీటి కొరత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా 50 పీజోమీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జిల్లాలో భూగర్భ జల మట్టాలు తెలుసుకునేందుకు అదనంగా మరో 50 పీజోమీటర్లు ఏర్పాటు చేసేందుకు భూగర్భ జల శాఖ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొదటి విడుతలో 20 పీజో మీటర్లను బిగించి ఆ తర్వాత రెండు విడుతల్లో 30 పీజో మీటర్లను బిగించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో భూగర్భ జలమట్టాలు తెలుసుకునేందుకు 27 మండలాల్లో ఒక్కో ప్రాంతంలో పీజో మీటర్లున్నాయి. పీజోమీటరు ఏర్పాటు చేసేందుకు బోరువేసి అందులో భూగర్భజలమట్టాలను తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో రూపొందించిన పీజో మీటర్ను బిగిస్తారు. పీజో మీటర్ వందశాతం కచ్చితత్వంతో భూగర్భ జల మట్టాలను తెలియజేస్తుంది. ఒక్కో పీజో మీటరు ఏర్పాటుకు సుమారు రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. పుల్కల్, శివంపేట, సుల్తాన్పూర్, గడ్డపోతారం, రామేశ్వరం, గుమ్మడిదల, సదాశివపేట, నిజాంపూర్, ఝరాసంగం, తాటిపల్లి, గార్లపల్లి, సిరిపురం, రెడ్డిఖానాపూర్, ఇర్గిపల్లి, మునిదేవునిపల్లి, ఫసల్వాది, రుద్రారం, ఇంద్రకరణ్, ఆత్మకూరు, ముత్తంగి, వనంపల్లి, కర్లచర్ల, పులసల్పహాడ్, బోరంచ, పల్వట్ల, నారాయణఖేడ్, సంజీవరావుపేట, మాసాన్పల్లి, వాసర్, ఫతేపూర్, కరస్గుత్తి, దేగుల్వాడి, బావిల్గావ్, చాప్టా(కె), జమ్గి, మహాబత్పూర్, న్యాల్కల్, డప్పూర్, బడంపేట, మల్చెల్మ, జాడిమల్కాపూర్, మొగుడంపల్లి, ధనసిరి, మన్నాపూర్, బిలాల్పూర్, జుల్కల్, కంది, ఐనోల్, నాగారం, తాలెల్మ గ్రామాల్లో కొత్తగా పీజోమీటర్లు ఏర్పాటు చేయనున్నారు.