Weather Update | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి, అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు.
ఎన్నికలు జరిగే మే 13న కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటు గరిష్ఠం 40 డిగ్రీలుగా, కనిష్ఠం 21.9 డిగ్రీలుగా నమోదైనట్లు వెల్లడించింది.