KCR | మేడ్చల్, మే 8 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఢమాల్ అయింది. నీళ్లు లేవు, కరెంటు లేదు.. దీని కారణంగా అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతింటున్నది. లండన్, న్యూయార్క్ లో కరెంటు పోతదమో కానీ తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చేసి చూయించాం. మేము అధికారంలో ఉన్నప్పుడు భూముల రేట్లు ఎట్లుండే..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వచ్చాక భూముల రేట్లు ఏ విధంగా పడిపోయాయే ప్రజలు ఆలోచించాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. త్రిబుల్ ఆర్ ట్యాక్స్పై వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని.. స్వయంగా దేశ ప్రధాని ఆరోపించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్లో కొద్ది పాటి వాన పడితేనే ఆరు గంటల కరెంటు పోయిన దుస్థితి నగరానికి వచ్చిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్మింగ్ అనే పరిశ్రమ హైదరాబాద్లో వెయ్యికోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివాళ కోరు పరిపాలన విధానంతో.. అది చెన్నైకి తరలిపోయిందన్నారు. పరిశ్రమలు తరలిపోతున్న క్రమంలోనే ఐటీ రంగం పూర్తిగా కుదేలైపోయిందన్నారు.
మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో టైగర్ లాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని కేసీఆర్ అన్నారు. కేపీ వివేకానంద్ 85 వేల మెజార్టీతో, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 75 వేల మెజార్టీతో గెలిచారని, ఇదే స్ఫూర్తితో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని 3 లక్షల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్ రోడ్షో కు పెద్ద ఎత్తున ప్రజలు, గులాబీ శ్రేణులు తరలివచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.