కళతప్పి ఉనికిని కోల్పోతున్న అడవులు నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రజలకు సాంత్వన చేకూర్చే లా.. ప్రకృతిలో సేదతీర్చేలా రూపుదిద్దుకుంటున్నాయి. అందుకు నిదర్శనమే సిద్దిపేట శివారులోని ‘తేజోవనం అర్బన్ పారెస్టు పార్కు’. 205 హెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం పునరుద్ధరించి తేజోవనం పేరుతో ఆధునీకరించింది. సిద్దిపేట పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో తేజోవనం అర్బన్ ఫారెస్టు పార్కు నిర్మాణాన్ని 2017లో ప్రా రంభించారు. కొండపాక మండలంలోని మర్పడగ, దుద్దె డ శివారులోని అటవీ ప్రాంతాన్ని అర్బన్ పార్కు కోసం కేటాయించారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ, ప్రజలకు ఆహ్లాదం అందించాలనే ఆలోచన వెరసి రూ.3.50 కోట్లతో ఆధునిక హంగులతో మన ముందుకు వచ్చింది. తేజోవనం నిర్మాణ సమయంలో పలుమార్లు మంత్రి హరీశ్రావు ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మొక్కలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
వన్యప్రాణుల సందడి…
తేజోవనంలో జింకలు, కొండగొర్రెలు, దుప్పులు, నక్కలు, అడవిపందులు, నెమళ్లు, కృష్ణజింకలు, వివిధ రకాల పక్షులు సందర్శకులకు కనువిందు చేస్తూ సందడి చేస్తున్నవి. వాటి రక్షణ కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి గుంతలు ఏర్పాటు చేశారు.
ప్రత్యేకతల పచ్చని పందిరి..
రాశి వనం..
తేజోవనంలో మరో ప్రత్యేక ఆకర్షణ రాశివనం. జ్యోతిష్య శాస్త్రంలోని రాశులకు అనుగుణంగా మొక్కలు పెంచారు. మేషరాశి-ఎర్రచందనం, వృషభం-ఏడాకుల పాల, మిథునం-పనస, కర్కాటక-మోదుగ, సింహ-కాలిగొట్టు, కన్య-మామిడి, తుల-పొగడ, వృశ్చిక-సండ్ర, ధనుస్సు-రావి, మకరం-జిట్రేగి, కుంభం-జమ్మి, మీనరాశి-మర్రి ఇలా 12 రాశులకు సంబంధించి మొక్కలు నాటారు.
చిట్టడవిని పోలే అటవీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఒక హెక్టార్లు విస్తీర్ణంలో సుమారు 10 వేల మొక్కలు పెంచారు. ఇందులో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, అనేక రకాల వృక్ష జాతులు పర్యాటకులకు స్వచ్ఛమైన ప్రాణవాయులను అందిస్తున్నవి. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తేజోవనంలో తీసిన ఫొటోలతో చేసిన ట్వీట్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. మరి ఇంకేందుకు ఆలస్యం.. వచ్చేయండి.. అందమైన ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు..
ఆహ్లాదానికి నెలవు…
నాగులబండ వద్ద తేజోవనం స్వాగత ద్వారాన్ని మహావృక్షాల ఆకృతిలో ఆకట్టుకునేలా నిర్మించారు. సందర్శకుల కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించారు. తేజోవనంలో మూడేండ్ల క్రితం లక్షకు పైగా నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదగడంతో పచ్చదనం పరుచుకుంది. ఇప్పటికే సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పర్యాటకులకు ఆహ్లాదానికి నెలవుగా మారింది. అదే స్థాయిలో తేజోవనం సిద్దిపేట అభివృద్ధిలో మరో కలికితురాయిగా చేరింది. పలు ప్రత్యేకతలతో అందరినీ పలకరించి పరవశుల్ని చేస్తోంది.