చైతన్య దీప్తిని చేతబూని వెనకబాటు చీకట్లను పారదోలిన ఉద్యమ పతాక తెలంగాణ రాష్ట్ర సమితి తన ఇరవై ఏండ్ల పోరాట స్మృతులను నెమరువేసుకున్నది. ఒక్కరితో యుద్ధం మొదలు పెట్టిన నాడు ఎదురైన అవహేళనలు, అవమానాల నుంచి తెలంగాణలోనే నేడు బలీయమైన ప్రజాశక్తిగా ఎదుగుతూ వచ్చిన ప్రస్థానాన్ని సమీక్షించుకున్నది. తెలంగాణ పురోగతియే ఆది అంతిమ ప్రాథమ్యంగా నిర్ణయించుకొని ఆ సంకల్ప ఆచరణకు అహరహం శ్రమిస్తున్న పయనంపై ప్లీనరీలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఉద్యమ రథ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తలపెట్టిన ఒక రోజు ప్లీనరీకి యావత్ తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా తరలివచ్చారు. సభా వేదిక అంతా జై తెలంగాణ నినాదాల హోరుతో సాంస్కృతిక కార్యక్రమాల జోరుతో ధూంధాంల సందడితో మార్మోగింది. ఉద్యమ జ్ఞాపకాలు, స్వరాష్ట్రం సాధించిన విజయాలు, ప్రగతి నివేదికలతో చర్చలు, తీర్మానాలు, మేధోమథనాలు జరిగాయి. ఆయా జిల్లాల నాయకులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. క్షేమ సమాచారాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కాగా చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఎగ్ మసాలా, మటన్ దాల్చా, బోటి ఫ్రై, తలకాయ పులుసు, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారుతో వంటి మొత్తం 36 రకాల పసందైన రుచులతో ప్లీనరీ ఘుమఘుమలాడింది. ప్రవేశద్వారం సెల్ఫీ పాయింట్ గా మారింది. ఉద్యమ స్మృతులు, కేసీఆర్ జీవిత ఘట్టాలతో కలిపి 1500 ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు.
ప్లీనరీ హైలైట్స్