జగిత్యాల : రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ. కోటి డీఎంఎఫ్టీ నిధులతో బోలు చెరువు నుండి ధర్మపురి పట్టణానికి మంచి నీటి సరఫరాకు శంకుస్థాపన చేశారు. దుబ్బలగూడెం గ్రామంలో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంను ప్రారంభించారు. అనంతరం దుబ్బలగూడెం గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం, రూ.7.5 లక్షల వ్యయంతో నిర్మించిన స్కూల్ ప్రహరీ గోడ, రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రొడ్డులను మంత్రి ప్రారంభించారు.
నక్కలపేటలో చాకలి ఐలమ్మ, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, పీఏసీఎస్ గోదాం ప్రారంభోత్సవం, ముదిరాజ్ బిల్డింగ్కు శంకుస్థాపన. బోధర నక్కలా చెరువు గూడెంలో కొమురం భీం విగ్రహవిష్కరణ, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనంను ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ జి. రవి, పీఏసీఎస్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.