ముంబై : తౌటే తుఫాను నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై, థానే, పలు తీరప్రాంత జిల్లాల్లో పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం సమీక్ష నిర్వహించారు. రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ జిల్లాల తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 12,420 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వీరిలో రాయ్గఢ్లో 8,380 మందిని, రత్నగిరిలో 3,896 మంది, సింధుదుర్గ్లో 144 మందిని తరలించినట్లు చెప్పారు. ముంబై, థానే, పొరుగు ప్రాంతాల పరిస్థితిని సీఎం సమీక్షించారని, తుఫాను కారణంగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్ రోగుల చికిత్సలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారని అధికారులు పేర్కొన్నారు. రాయ్గఢ్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ కాగా.. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
మరో వైపు డెప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం సచివాలయంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు, సన్నాహాలపై పవార్ సింధుదుర్గ్, రాయ్గఢ్, థానే, పాల్ఘర్, ముంబై సిటీ, ముంబై శివారు, బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. మరో వైపు తౌక్టే అతి తీవ్ర తుఫానుగా మారింది. సాయంత్రానికి తుఫాను గుజరాత్ తీరానికి చేరుకొని.. రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. భారీ గాలులతో కురుస్తున్న వర్షానికి ముంబైలో పలు చెట్లు నేలకూలాయని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.