మంచిర్యాల ఏసీసీ,జూలై 29 : జిల్లాప్రజలకు ఆర్టీపీసీఆర్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్ మొదటి, రెండో వేవ్లో నిర్ధారణకు ర్యాపిడ్ యాంటిజన్ తోపాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కూడాచేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకున్న వారి శాంపిళ్లను వైద్య శాఖ అధికారులు సేకరించి హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు పంపించేవారు. రిపో ర్టు వచ్చేందుకు వారం రోజుల సమయం పట్టేది. దీంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరిగి రోగి పరిస్థితి విషమించేది. దీన్ని గుర్తించిన అధికారులు జిల్లా సర్కారు దవాఖానలో రూ. 80 లక్షలతో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. త్వరలో జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో హైదరాబాద్ నిమ్స్ దవాఖాన నుంచి వచ్చిన ఐదు ప్రత్యేక శాంపిల్స్ వాటి ఫలితాల కోసం పరీక్షలను ప్రారంభించారు. వచ్చిన ఫలితాలను నిమ్స్ మైక్రోబయోలజీ వారికి పంపించిన అనంతరం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఇచ్చే నివేదిక ప్రకారం జిల్లాలో సేవలను అధికారులు ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్స్, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 11 మంది సైంటిస్ట్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.ల్యాబ్ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా అందనున్నాయని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.
త్వరగా ఫలితాలు..
ఇంతకుముందు ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను హైదరాబాద్, వరంగల్ , అదిలాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ప్రభుత్వం జిల్లాకేంద్రంలో ల్యాబ్ను ఏర్పాటు చేసింది. పరీక్షల ఫలితాలు వచ్చేందుకు 24 నుంచి 48 గంటల సమయం పట్టనున్నది. దీనికి గాను అనుమానితుల నుంచి సేకరించిన నమూనాను మొదటగా బయోసెఫ్టీ కేబినెట్లో, అనంతరం ఆర్ఎన్ఏ మిషన్లో, చివరకు పీసీఆర్ మిషన్ లో ఇలా మూడు దఫాలుగా పరీక్షల అనంతరం పాజిటివ్, నెగిటివ్ అనేది నిర్ధారణ అవుతుంది. ఒక కిట్ ద్వారా 93 శాంపిల్స్ పరీక్షలను చేయవచ్చు.
డాక్టర్ సరిగమ, మంచిర్యాల సర్కారు దవాఖాన
ఇన్చార్జి నోడల్ అధికారి