మహబూబ్ నగర్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్లోని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికిపూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాత్ర అత్యంత విశిష్టమైందని పేర్కొన్నారు. నాటి దొరల అరాచకాలు, మొగలాయుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని సామాన్య ప్రజల హక్కులను కాపాడిన గొప్ప యోధుడు ఆయన అని కొనియాడారు. పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, నాయకులు మైత్రి యాదయ్య, తెలుగు గూడెం ఆంజనేయులు, గ్యాస్ అంజి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.