మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్ టౌన్, జనవరి 25 : పాలమూరు మున్సిపాలిటీలో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. ఈనెల 27న జరిగే అవిశ్వా స తీర్మానం నెగ్గుతుందా!? వీగిపోనున్న దా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. దీంతో పట్టణం లో రాజకీయం రసవత్తరంగా మారింది. వీగిపోయేలా చేసేందుకు బీఆర్ఎస్ రెడీ కాగా.. ఎలాగైనా నెగ్గించుకోవాలని హస్తం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లకుగానూ బీఆర్ఎస్, కాంగ్రెస్ శిబిరాల్లో చెరి సగం మంది ఉన్నారు. అధికార పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ వీగిపోయేలా చేసేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కౌన్సిలర్లకు భారీగా నజరానాలు ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగే అవిశ్వాస తీర్మాన ప్రక్రియపై అందరి దృష్టి పడింది. అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం బల్దియాలో అత్యధికంగా బీఆర్ఎస్కు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్కు ఐదుగురు, బీజేపీకి ఐదుగురు, ఎంఐఎంకు నలుగురు, స్వతంత్రులు ఐదుగురు ఉన్నారు. కాగా జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు కయ్యానికి దిగుతుంటే.. ఈ మున్సిపాలిటీలో మాత్రం కమలం పార్టీ.. హస్తానికి మద్దతు పలుకుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అయితే ఇండిపెండెంట్లు, స్వతంత్రుల సహకారం.. నలుగురు బీఆర్ఎస్ రెబల్స్తో కలిపి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. దీనికి స్పందించిన కలెక్టర్ 27న మహబూబ్నగర్ మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంతోపాటు నలుగురు బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లను కలిపితే 19 మందికి చేరింది. 30 మందిలో బీఆర్ఎస్ వైపు 20 మంది ఉండగా.. మరో ఐదుగురు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఇక మరో ఐదు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలం సరి సమానంగా మారింది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేసేందుకు మాజీ మంత్రి రంగంలో దిగారు. కాగా అధికార పార్టీ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు భారీగా ఖర్చు పెడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కొంతమంది కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు గోవా టూర్కు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే భారీగా నగదు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఆశ చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పార్టీ సింబల్పై గెలిచి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు కౌన్సిలర్లను అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసింది. ఒకవైపు కోర్టులో కేసు.. మరో వైపు విప్ జారీ కావడంతో గులాబీ పార్టీలో ధీమా వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గనీయబోమని మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్ తేల్చి చెప్పారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయించి అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. ప్రస్తుతం కొంతమంది కౌన్సిలర్లు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లినా.. మిగతా కౌన్సిలర్లందరినీ పార్టీ నేతలు జంప్ కాకుండా చూస్తున్నారు. మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్మానాన్ని విఫలం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కౌన్సిలర్లు చేజారకుండా చూస్తున్నారు. అధికార పార్టీని దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అనైతిక కార్యకలాపాలకు శ్రీకారం చుడుతోంది. స్థానిక సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత బల్దియాలో ఆ పార్టీకి కేవలం ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఇటు బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతోపాటు బీఆర్ఎస్ నుంచి కొందరు కౌన్సిలర్లను లాగేందుకు భారీ నజరానాలను ఇస్తుందని ప్రచారం జరుగుతున్నది. చైర్మన్ పదవి ఆశిస్తున్న ఓ చోటా లీడర్ తనకు మద్దతిస్తున్న కౌన్సిలర్లను తీసుకొని గోవాకు విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే మళ్లీ కౌన్సిలర్ టికెట్తో పాటు కార్లు, ప్లాట్లు ఇస్తామని ప్రలోభాలకు దిగారు. కాగా ఇదివరకే ఆయా వార్డుల్లో పార్టీలో పని చేస్తున్న సీనియర్ నేతలు దీనిపై భగ్గుమంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అన్నీ చేస్తే పదేండ్ల నుంచి జెండా మోసిన తమ గతేం కావాలని నిలదీస్తున్నారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో ఈ రెండు జాతీయ పార్టీలు కయ్యానికి కాలుదువ్వుతుంటే.. ఇక్కడ మాత్రం కలిసి పనిచేయడం విడ్డూరంగా ఉందని జనం అంటున్నారు. అధికారం కోసం ఈ రెండు పార్టీలు ఒకటి కావడంపై విమర్శలు వస్తున్నాయి. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి గెలిచిన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకో ఏడాది కూడా లేని పదవి కన్నా ఆ పార్టీ ఇచ్చే తాయిలాల కోసం కౌన్సిలర్లు సిద్ధాంతాలను వదిలేశారు. పార్టీ గుర్తులపై గెలిచిన కౌన్సిలర్లు ప్రలోభాలకు లొంగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ లో ఇప్పుడున్న పాలకవర్గంపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కొంతమంది కౌన్సిలర్లు ఇచ్చిన నోటీసులను పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ 27న మున్సిపల్ ప్రత్యేక సమావేశానికి శ్రీకారం చుట్టారు ఈ సమావేశంలో పాలకవర్గంపై అవిశ్వాస ప్రకటన పైనే ఓటింగ్ నిర్వహిస్తారు. 49 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్కు 30 మంది, కాంగ్రెస్కు ఐదుగురు, బీజేపీకి ఐదుగురు, ఎంఐఎంకు నలుగురు, స్వతంత్రులు ఐదుగురు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి కాంగ్రెస్లో చేరారు. పార్టీ సింబల్తో గెలిచిన వీరిని అనర్హులుగా ప్రకటించాలని ప్రస్తుత చైర్మన్ నరసింహులు కోర్టులో కేసు వేశారు. ఇది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా..? వీగిపోతుందా..? అనే ఉత్కంఠ నెలకొన్నది.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రె స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కొందరు కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ వైపునకు తిప్పుకున్నా.. అంతిమ విజయం మాత్రం బీఆర్ఎస్దే.. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి సత్తా చాటుతాం.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాం.