ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. ఇప్పటికే ఎనిమిది విడుతల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోగా నేడు సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పటికే పల్లె, బృహత్ వనాలతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఇదే ఉత్సాహంతో గ్రామాలు, పట్టణాల్లో వేలాది మొక్కలను నాటే 9వ విడుతకూ అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ఏడాది వానకాలంలో చేపట్టే బృహత్ కార్యక్రమాన్ని ఈసారి విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వన నర్సరీల్లో మొక్కలను పెంచి నిర్ణీత సమయానికి అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. వీటిని రోడ్లకిరువైపులా.. ఖాళీ స్థలాల్లో .. కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణల్లో.. నాటేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
– నాగర్కర్నూల్, మే 11 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, మే 11 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ మానసపుత్రిగా భావించే హరితహారం పథకంతో గ్రామాలు, పట్టణాలు పచ్చదనం సంతరించుకుంటున్నాయి. అటవీశాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచేలా 2015 జూలై 3న హరితహారం ప్రారంభం కాగా.. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ఉద్యమంలా కొనసాగుతున్నది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలను పెంచుతున్నారు. ఏటా వర్షాలు సమృద్ధిగా కురిసిన తరువాత మొక్కలను నాటుతున్నారు. ఒక్కో గ్రామంలో దాదాపుగా 10 వేల మొక్కలను నాటాలని పంచాయతీలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేయడం, నాటడంవంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి ప్రభుత్వ విభాగం, కార్యాలయానికి లక్ష్యం విధిస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ఫలితంగా సామాన్య ప్రజల్లోనూ మొక్కల పెంపకంపై అవగాహన పెరిగింది. అలాగే హరితనిధి పేరిట వ్యాపార నిర్వాహకులకు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి పన్నులు, ఫీజుల రూపంలో విరాళాలు సేకరిస్తున్నది. దీంతో ఆయా వర్గాల్లో హరితహారంపై ఆసక్తి పెరిగింది. ఇవే కాకుండా గ్రామాల్లో పల్లె వనాలు, బృహత్ వనాలను సైతం ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వ భూముల్లో ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలాల్లో మొక్కలను నాటుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని రూపొందిస్తున్నారు. రోడ్లకిరువైపులా నాటే మొక్కలు కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటేందుకు గోతులు తీయడంతోపాటు మొక్కలను పెరిగే వరకూ సంరక్షిస్తున్నారు. నాటిన మొక్కలకు ఫెన్సింగ్, పంచాయతీకి పంపిణీ చేసిన ట్రాక్టర్లతో నీళ్లు పోస్తున్నారు.
మొక్కల సంరక్షణకు అధునాతన జీపీఎస్ పద్ధతిని సైతం అమలు చేస్తున్నారు. నాటిన మొక్కలు వంద శాతం బతికించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగా గ్రామాల్లో హరితహారం పథకం పకడ్బందీగా అమలవుతున్నది. వానలు కురిసే సమయానికి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లోనే మొక్కలను పెంచుతున్నారు. పెరిగిన మొక్కలను నిర్దేశించిన లక్ష్యం మేరకు ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇలా జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి గ్రామాల్లోనూ హరితహారం ఉద్యమంలా కొనసాగుతుంది. నాగర్కర్నూల్ జిల్లాలో 2015 నుంచి ఇప్పటివరకు 4.53 కోట్ల మొక్కలను నాటారు. 662 పల్లె ప్రకృతి వనాలు, 64 బృహత్ వనాలను ఏర్పాటు చేశారు. 2023లో 45 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యం నిర్దేశించగా.. 461 పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో మొక్కల వివరాలు..
ఏడాది నాటిన మొక్కలు
2015 35 లక్షలు
2016 64 లక్షలు
2017 1.16 కోట్లు
2018 1.25 కోట్లు
2019 1.27 కోట్లు
2020 1.30 కోట్లు
2021 74.4 లక్షలు
2022 68.7 లక్షలు
టార్గెట్.. 45 లక్షలు
పర్యావరణ పరిరక్షణకు, అటవీ శా తాన్ని పెంచేందుకు హరితహారం ప థకం అమలవుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 4.53 కోట్ల వరకు మొక్కలను నాటాం. ఈ ఏడాది 45 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 461 పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. వచ్చే వానకాలం నాటికి మొక్కలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
– నర్సింగరావు, డీఆర్డీవో, నాగర్కర్నూల్