అచ్చంపేట, మే 21 : రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్లో విక్రయించేందుకు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి అచ్చంపేట, ఉప్పునుంతలతోపాటు పరిసర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకువచ్చారు. అయితే నెలరోజులుగా రైతులు మార్కెట్యార్డులోనే ధాన్యంతో గడుపుతున్నారు. మార్కెట్ మొత్తం ధాన్యం బస్తాలతో నిండిపోవడంతో తుకాలు సకాలంలో జరుగడం లేదు. లారీలు, సంచుల కొరత కారణంగా తూకం అయిన ధాన్యాన్ని తరలించడం లేదు. అచ్చంపేట మార్కెట్లో ప్రస్తుతం 60వేలపైగా బస్తాలు నిల్వ ఉన్నాయి.
గురువారం సాయంత్రం నుంచి కురిసిన వర్షం ఈదురుగాలులు, వర్షానికి మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొన్ని కుప్పలు పూర్తిగా తడిసిపోగా, మరికొన్ని కుప్పలలోకి నీళ్లు మల్లుకున్నాయి. రైతులు సొంతంగా కవర్లు తెచ్చుకొని ధాన్యాన్ని కప్పి రక్షించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు.

సాయంత్రం మొదలైన వర్షం కొద్దిసేపు విరామం ఇచ్చి తిరిగి రాత్రి 8గంటల నుంచి ప్రారంభమైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి మార్కెట్లోని ధాన్యం వరదకు కొన్ని కుప్పలు కొట్టుకుపోయాయి. షెడ్ల కింద ఉన్న కుప్పలు తప్పా మిగిలిన ధాన్యం మొత్తం కుప్పలు తడిసిపోయాయి.
కళ్లముందే పంట వర్షం పాలు అవుతుంటే రైతులు చేసేదేమిలేక కన్నీళ్లతో దిగమింగుకున్నారు. ప్రభుత్వంపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగాని ప్రభుత్వం, అధికారులు ఎందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. నెలరోజులుగా మార్కెట్లో ధాన్యం పెట్టుకొని పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు వర్షం మరో వైపు కరెంటు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్ధితిలో ఉండిపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు పాండు, పర్వతాలు, వెంకట్రెడ్డి, కృష్ణయ్య తదితరులు డిమాండ్ చేశారు.