వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే వనపర్తి నియోజకవర్గంలోని 7 మండలాలు, 42 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 7 వార్డుల్లో మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లాస్థాయి అధికారులు పల్లెనిద్ర చేయనున్నారు.
ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారుల బృందం వెళ్తుంది. దీనిలో భాగంగా ఘనాపూర్ మండలం తండాలో మంత్రి నిరంజన్ రెడ్డి బస చేయనున్నారు. మరో గ్రామంలో కలెక్టర్ బస చేస్తారు. ఉదయం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రణాళికలు అమలు చేయనున్నారు.