వనపర్తి : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjanreddy) అన్నారు. జిల్లాలోని వనపర్తి మండలం చీమనుకుంటపల్లి, చిట్యాల, అంకూరు, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు. ఇది తెలంగాణ బతుకుదెరువును నిర్ణయించే ఎన్నికలని అభివృద్ధి, సంక్షేమాలు జరుగాలంటే బీఆర్ఎస్ (BRS) ను మరోసారి గెలిపించాలని కోరారు.
ప్రస్తుతమున్న రూ. 2,016 ఫించన్ను రూ.5 వేలకు పెంచుకోబోతున్నామని, రైతులకు పెట్టుబడుల ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో రైతుబంధు ( Raitu Bandu) ను కూడా రూ.16 వేలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ‘గ్యాస్ సిలిండర్ ధర పెంచేది, తగ్గించేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ ఎంత పెరిగిన ప్రజల మీద భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించి రూ.400 లకే సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
తెలంగాణ రాకముందు వ్యవసాయం, గ్రామాలు ఎలా ఉండేవి. వచ్చిన తరువాత వచ్చిన మార్పును గమనించాలని సూచించారు. వనపర్తి జిల్లాలో మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయం, నర్సింగ్, పీజీ, మత్స్యకళాశాలలు తీసుకువచ్చాను వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల గిరిజనతండాల్లో జీవన మార్పులు వచ్చాయని తెలిపారు. నాడు బీటలు బారిన భూముల ధరకు రెక్కలు వచ్చాయని చెప్పారు.