గద్వాల, ఆగస్టు 15 : మహానుభావులు కలలు గన్న భారతావని నిర్మాణానికి అందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉపసభాపతి పద్మారావు అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కాగా పోలీసులు గౌరవందనం సమర్పించారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతిని చదివి వినిపించారు. జిల్లాలో ఈ వానకాలంలో 3,90,325 ఎకరాలకు గానూ ఇప్పటివరకు 2,14143 ఎకరాల్లో పంటలు సాగయ్యాయన్నారు. రైతుబంధు కింద 1,52,147మంది ఖాతాలో రూ.161కోట్లు, రైతుబీమా కింద 2802 మంది నామినీల ఖాతాల్లో రూ.140 కోట్లు జమ చేశామన్నారు. 445మంది రైతులతో 1,628 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేసినట్లు వివరించారు. 334 రేషన్ షాపుల్లో 1,60,244 కార్డులకు గానూ 5,47,981 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత వానకాలానికి 2,292మంది రైతులకు రూ.17.59కోట్ల పంట రుణాలు పంపిణీ చేశామన్నారు. వందశాతం సబ్సిడీతో 375 చెరువుల్లో కోటీ 69లక్షల చేపపిల్లలను వదిలామన్నారు. వానకాలం సాగుకు జూరాల కుడి కాల్వ ద్వారా 35వేల ఎకరాలకు, ఆర్డీఎస్ నీటి లభ్యతను బట్టి 55వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో 319 ఆవాసాలకు, 347 కొత్త ఓహెచ్ఆర్సీలు ఏర్పాటు చేసి 1,41,529 నల్లా కనెక్షన్లతో తాగునీటిని అందిస్తున్నామన్నారు. మన ఊరు-మన బడి 161 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
జిల్లా దవాఖానలో డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా 134 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4624 మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ధరణిలో 57,717 స్లాట్స్ నమోదు కాగా 56,030 స్లాట్స్ పూర్తి చేశామన్నారు. ఇప్పటివరకు 25,790 భూములకు సంబంధించి ఫిర్యాదులు రాగా 23,391 పరిష్కరించామన్నారు. గద్వాల నియోజకవర్గం గోనుపాడ్ గ్రామంలో 25 డబుల్బెడ్రూం ఇండ్లు, పట్టణంలో 560 ఇండ్లు నిర్మించామన్నారు. మరో 715 ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. కల్యాణలక్ష్మి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1058మందికి రూ.10.59కోట్లు, షాదీ ముబారక్ ద్వారా 117మందికి రూ.1.17కోట్లు అందజేశామన్నారు. చేనేతమిత్ర పథకం కింద 6,243 చేనేత, అనుబంధ కార్మికులకు రూ.10.11కోట్లు జమ చేశామన్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 7106 మందికి రూ.16.59కోట్లు జమ చేశామన్నారు. మద్యం దుకాణాల ద్వారా రూ.39.3కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా 543 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నేను సైతం కార్యక్రమం ద్వారా 922 సీసీ కెమెరాలు ఇండ్లు, దుకాణాల్లో ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ శాఖల్లో ప్రతిభ కనబర్చిన 58మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి పద్మారావు అందజేశారు. అనంతరం స్టాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ క్రాంతి, -అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్, శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.