దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు. మక్తల్ పట్టణంలో వారం వ్యవధిలోనే పలు కాలనీల్లోని ఇండ్లల్లోకి చొరబడ్డారు. ఓ పథకం ప్రకారం దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. దాదాపు పది ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడి రూ.లక్షల నగదు, బంగారం దోచుకెళ్తున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగతనాలకు పాల్పడుతున్న వారు ఒకేరకమైన మాస్కులు వేసుకోవడంతో ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించి దొంగలను పట్టుకొని చోరీ జరిగిన సొత్తు రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మక్తల్, డిసెంబర్ 17 : చీకటి పడితే ఎవరి ఇంటికి కన్నం వేస్తారో, ఎవరి ఇంటిలో దొంగతనాలు జరుగుతాయోనని భయంతో స్థానికులు వణికి పోతున్నారు. ఓ పథకం ప్రకా రం దుండగులు తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. మక్తల్ పట్టణంలో వారం రోజుల్లో పలు కాలనీలల్లో వరుస దొంగతనాలు జరిగాయి. పది ఇండ్లల్లో గుర్తు తెలియన వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈనెల 11న మక్తల్ పట్టణంలో పాత సినిమా టాకీస్ ఏరియాలో సాదిక్పాషా ఇంట్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ముఖానికి మంకీ మాస్కులు ధరించి ఇంటి తలుపు తట్టారు. ఇంట్లో ఉన్న బాలింత తలుపు తీయడంతో దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి యజమానులు పని నిమిత్తం బయటకు వెళ్లడంతో పదిహేను రోజుల బాలింత మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంది. నలుగురైదుగురు ముఖానికి మంకీ మాస్కులు వేసుకున్న దుండగులు పసి కందును చేతిలోకి తీసుకొని ఇంట్లో ఎక్కడ డబ్బులు ఉన్నాయో చెప్పాలని, లేకపోతే నీ బిడ్డను నేలకు విసిరి వేస్తామని బెదిరించారు. దీంతో బీరువా తాళాలు తీసుకుని అందులో ఉన్న రూ.5.5 లక్షలు తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా గత నెల 28న తెల్లవారు జామున 3-4 గంటల ప్రాంతంలో మక్తల్ పట్టణంలో అయ్యప్పకాలనీలో దాసరిదొడ్డి వెంకటప్ప ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒకరి ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 8 తులాల వెండి గ్లాసు, రూ.5 వేల నగదు దొంగిలించారు.
అదేరోజు అయ్యప్పగుడి సమీపంలో తాళం వేసి ఉన్న ఒక ఇంటిని, పక్కనే షటర్ తాళాలు విరగొట్టి దోపిడీకి విఫలయత్నం చేశారు. స్టోర్ రూంలో చిన్నపిల్లల బిస్కెట్ ప్యాకెట్లు, పటాకులు సంచులు ఉండడంతో ఏమి లభించలేదు. అయితే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మంకీ మాస్కులు వేసుకొని ఉన్నట్లు సీసీ కెమెరాలో రికాైర్డెంది. అక్కడి నుంచి శ్రీరామ్నగర్, న్యూ శబరి కాలనీలో ఒక టీచర్ ఇంట్లో బీరువా తాళాలు విరగొట్టి వస్తువులు చిందర వందర చేశారు. కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో ఈనెల 9న పట్టపగలు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తిరుమలగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో బీరువాలో ఉంచిన ఆరు తులాల బంగారం, రూ.40 వేలు నగదు ఎత్తుకెళ్లారు. అయితే వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ? అనేది పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అందరు ఒకే విధంగా ముఖానికి మంకీ మాస్కులు వేసుకొని ఉన్నారు. దాదాపు పది మంది మహిళలు, పది మంది పురుషులు గుర్తుతెలియని వ్యక్తులు మక్తల్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఒక వేళ ఉపాధి కోసం వచ్చి స్థానికంగా ఇటుకల బట్టీలలో పనులు చేస్తూ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారా? అనేది ప్రశ్నార్థంగా మారింది. కాగా పట్టణంలో రాత్రి వేళలో పోలీసులు సరైన విధంగా పెట్రోలింగ్ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దొంగ తనాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
మక్తల్ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పలువురు బాధితులు ఈనెల 11న ఈవిషయమై స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి ఫిర్యాదు చేశారు. మరో విచిత్రం ఏమిటంటే ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే పట్టణంలో పాత సినిమా టాకీస్ ఏరియాలో సాదిక్పాషా అనే వ్యక్తి ఇంట్లో దాదాపు రూ.5. 5 లక్షలు దోచుకొని వెళ్లడం గమనార్హం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అవసరమైతే రాత్రి వేళలో దొంగతనాలు జరగకుండా తాను గస్తీ తిరుగుతానన్నారు. పట్టణంలో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళలో పెట్రోలింగ్ చేయాలని, దొంగలను పట్టుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక సీఐ, ఎస్సైలను ఆదేశించారు.
మిడ్జిల్, డిసెంబర్ 17 : మిడ్జిల్లోని పోలీసు స్టేషన్ స మీపంలో ఉన్న కిరాణం దుకాణంలో చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్సై శివనాగేశ్వర్ కథనం మేరకు మండల కేం ద్రంలోని పురుషోత్తం కిరాణం దుకాణంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాపులో రూ.20 వేల నగదు, రూ. 10వేల సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.