కేటీదొడ్డి, డిసెంబర్ 24: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన కేటీదొడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. హెడ్కానిస్టేబుల్ రఘునాథం కథనం మేరకు.. ధరూర్ మండలంలోని భీంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (27), ఉపేంద్ర (32) నందిన్నెలో ఇటుకలను ట్రాక్టర్లో లోడ్ చేసుకొని స్వగ్రామానికి వెళ్తుండగా.. మైలగడ్డ స్టేజీ సమీపంలోని ఉడుంగుండు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలో పడింది. దీంతో ఉపేంద్ర, శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందారు.
శ్రీనివాసులకు ఇంకా పెండ్లి కాకపోగా.. ఉపేంద్ర మూడేండ్ల కిందటే ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. ఉపేంద్రకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనతో ధరూర్, కేటీదొడ్డి మండలాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. భీంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.