జడ్చర్ల, ఏప్రిల్ 10 : గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నారు. దళిత, గిరిజన, బహుజనుల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడానికి ప్రభుత్వం వందలాది గురుకులాలను ఏర్పాటు చేస్తోంది. సకల సౌకర్యాలను కల్పిస్తూ కార్పొరేటు స్థాయిలో విద్యను అందిస్తున్నది. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేస్తూ విద్యనందిస్తున్నది.
జిప్లస్ టులో భవన నిర్మాణం
మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం కోడ్గల్లో రూ.4.20కోట్లతో గిరిజన గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తుంది. జడ్చర్ల నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేయించారు. కోడ్గల్లో రెండెకరాల స్థలంలో రూ.4.20కోట్లతో సొంతభవనం నిర్మించారు. ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. మొత్తం జిప్లస్ టులో భవనం నిర్మిస్తున్నారు. మూడు బ్లాకులు ఒక్కో బ్లాకులో 8గదులు ఉన్నాయి. మొత్తం భవనంలో 24గదులు ఉన్నాయి. అందులో తరగతి గదులతోపాటు హాస్టల్వసతి ఉంది. ఈ రెసిడెన్సియల్ పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 420మంది విద్యార్థులు విద్యను అభ్యసించనున్నారు. ఆ భవనానికి పక్కనే కిచెన్, డైనింగ్ కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా మరో భవనాన్ని త్వరలోనే నిర్మించనున్నారు. అందులో రెసిడెన్షియల్ బాలికల కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో 7ఉన్నాయి.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు
గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి.విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోడ్గల్లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు ఈ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశం. ఇలాంటి పాఠశాలను జడ్చర్ల మండలం కోడ్గల్లో ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషితో ఈ పాఠశాలను కోడ్గల్లో ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు.
-ఇంతియాజ్ఖాన్, ముడా డైరెక్టర్, కోడ్గల్
ఏప్రిల్ చివరికల్లా అందుబాటులోకి..
జడ్చర్ల మండలంలోని కోడ్గల్ వద్ద నిర్మిస్తున్న గిరిజన గురుకుల రెసిడెన్షియల్(బాలికల)పాఠశాలను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేస్తాం. రూ.4.20కోట్లతో ఈ భవనాన్ని నిర్మింస్తున్నాం. మొత్తం 24గదులు ఉన్నాయి. భవననిర్మాణం పూర్తయి పెయింటింగ్ చేస్తున్నారు. కిచెన్, డైనింగ్ మాత్రమే మిగిలాయి. వాటినికూడా త్వరలోనే పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకల్లా భవనాన్ని అదుబాటులోకి తీసుకొస్తాం.
– వెంకటేశ్వరసింగ్, డీఈఈ, గిరిజన సంక్షేమశాఖ