అచ్చంపేట, జూలై 18 : ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే రాజకీయ సమాధి తప్పదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. అచ్చంపేట మండలం పుల్జాల రైతువేదిక వద్ద మంగళవారం నిర్వహించిన నిరనస కార్యక్రమానికి గువ్వల హాజరు కాగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గువ్వల మాట్లాడారు. ఉచిత విద్యుత్తుతో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందుతుంటే, కాంగ్రెస్ పార్టీ కండ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు శిశ్యుడు రేవంత్రెడ్డి.. చంద్రబాబు లెక్క తెలంగాణకు పెనుభూతంగా మారిండన్నారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు బట్టబయలు అవుతున్నాయని విమర్శించారు. రైతుల జోలికొస్తే రేవంత్రెడ్డిని వారే తరిమికొడతారన్నారు. 3గంటల కరెంటు చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే తిరగుబాటు చేయడంతో అతడు ఒంటరివాడయ్యాడన్నారు.
పూటకో మాట, గంటకో అబద్ధం ఆడుతున్న రేవంత్రెడ్డిని ప్రజలు బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రేవంత్కు షాక్లు తగులుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చే 24గంటల కరెంటు కావాలా? రేవంత్రెడ్డి 3గంటల కరెంటు కావాలా? అని రైతులను అడుగగా రేవంత్రెడ్డివి దొంగమాటలు, మాకు కేసీఆర్ ఇచ్చే 24గంటల కరెంటు కావాలని చేతులెత్తి మద్దతు పలికారు. బీఆర్ఎస్ రైతులు, పేదలు, కర్షకుల పార్టీ అన్నారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతువేదిక, ప్రకృతివనం కోసం స్థలాలు ఇచ్చిన వారికి వచ్చే నెలలో ‘గృహలక్ష్మి’ పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా శివాలయం, పెద్దమ్మ, ఆంజనేయస్వామి, ఎల్లమ్మ ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రూ.2,300కోట్ల నిధులతో అచ్చంపేట ప్రాజెక్టులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చేతులమీదుగా తొందరలోనే ప్రాజెక్టు పనులను ప్రారంభించుకుందామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్కమిటీ చైర్పర్సన్ అరుణ, మాజీ చైర్మన్ తులసీరాం, ఎంపీపీ లోక్యానాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, నారాయణరెడ్డి, రామాచారి, తిరుపతి, సతీశ్, శంకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.