బీజేపీకి బీటలు పడుతున్నాయి. మొదటి విడుతలో కొందరికే టికెట్లు కేటాయించగా.. సీట్లు దక్కని వారి లో అసమ్మతి జ్వాల రాజుకున్నది. ఇంకా రెండో విడుత ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది. అయితే ఎవరన్నా ఇతర పార్టీల అసంతృప్తి నేతలు వస్తారేమోనన్న ఆశతో ఇంకా టికెట్లను ఖరారు చేయడం లేదు. అయితే ఏ ఒక్క నాయకుడు కమలం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఉన్న బీసీ నేతలు సైతం పార్టీ పోకడ నచ్చక ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. దీనికి తోడు పాలమూరు టికెట్ను మాజీ ఎంపీ కొడుక్కి కేటాయించడంతో సీనియర్లు ఖంగుతున్నారు. గద్వాల నుంచి పోటీపై ఇంకా అనిశ్చితితొలగలేదు. ఇక డీకే అరుణ, జితేందర్రెడ్డి తీరు ‘ఎవరికి వారే యమునా తీరే’.. అన్న చందంగా తయారైంది.ఓ వైపు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తుండగా.. కమలంలో కల్లోలం మొదలైంది.గత ఎన్నికల ఫలితాలన్నా వస్తాయో.. లేదోనన్న అయోమయం క్యాడర్లో నెలకొన్నది.
మహబూబ్నగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలు సమీపిస్తున్నా బీజేపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీ ఆశవాహుల్లో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినా ఇంకా కమలం లిస్ట్ రాకపోవడంతో అన్ని నియెజకవర్గాల నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక ఇతర పార్టీల నేతలు వస్తారని ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. పార్టీలో టికెట్లు ఆశించిన వారికి మొండిచెయ్యి చూపడంతో వారంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. మహబూబ్నగర్ టికెట్ను ఆశించిన నేతలకు కంగుతినిపిస్తూ రాజకీయ అనుభవం లేని మాజీ ఎంపీ కుమారుడికి ఇవ్వడంతో అసంతృప్తి చెందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ కారెక్కేశారు. గద్వాల నియోజకవర్గంలో కూడా పార్టీ జాతీయ కార్యదర్శి డీకే అరుణ పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఇక్కడ గెలిచే అవకాశం లేదని తెలిసి బీసీలకు టికెట్లు ఇప్పిస్తానని చెబుతున్నా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో ఆ పార్టీ నేతలు పోటీ చేయడానికి అసక్తి చూపడం లేదు. మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర నియెజకవర్గాల్లో పోటీ చేయాలంటేనే జంకుతున్నారు. కాస్తోకుస్తో బలం ఉందనుకున్న నారాయణపేట జిల్లాలో అభ్యర్థుల ఖరారు చేయకపోవడంతో నేతల్లో అసంతృప్తి రగులుతున్నది. జిల్లాలో పార్టీ వర్గాలుగా చీలిపోయింది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, జాతీయ కార్యదర్శి డీకే అరుణలు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. కాగా, ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకు సరైన గౌరవం దక్కకపోవడంతో చాలామంది ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదంతా చూస్తుంటే మళ్లీ 2018 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని, పోటీ చేసి లాభం లేదని భావిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా టికెట్లు ఖరారు చేయపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు ఇంకా 30రోజులే సమయం ఉన్నందునా ఇంకెప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారని నిలదీస్తున్నారు. బీజేపీ ఇప్పటివరకు ప్రకటించిన తొలి జాబితాలో కల్వకుర్తి, కొల్లాపూర్ అభ్యర్థులను మాత్రమే ఫైనల్ చేసింది. ఇటీవల మహబూబ్నగర్ నియెజకవర్గానికి మాజీ ఎంపీ కుమారుడికి టికెట్ కేటాయించింది. మిగితా తొమ్మిది నియెజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయడకుండా పెండింగ్లో పెట్టింది. కాగా జడ్చర్ల, అచ్చంపేట, కొడంగల్, అలంపూర్ నియెజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ సుముఖంగా లేరు. అయితే కల్వకుర్తికి చెందిన మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ ఇటీవల బీజేపీలో చేరారు. అతడిని జడ్చర్ల నియెజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు సమాయత్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని రెండు స్థానాల్లో పార్టీ నేతలు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఇరువర్గాలు తమకే కావాలని పట్టుబడుతున్నాయి.
గత ఎన్నికల్లో గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ సునామిలో కోట్టుకుపోయిన డీకే అరుణ ఆ తర్వాత వెంటనే బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో డీకే అరుణకు కేంద్ర బీజేపీ నాయకత్వం జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చింది. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు యత్నించింది. కానీ డీకే అరుణ సొంత నియెజకవర్గంలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసినా ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆమె గద్వాల నుంచి పోటీకి విముఖత చూపిస్తున్నారు. తాను స్వయంగా చేసుకున్న సర్వేల్లో మూడోస్థానం రావడంతో పోటీకి వెనుకంజ వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గద్వాలలో బీసీ అభ్యర్థితో పోటీ చేయించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. ఓడిపోయే సీటు మాకు అంటగడ్తరా అంటూ బీసీ నేతలేవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో గద్వాలలో బీజేపీ పోటీ చేస్తుందా? లేక బీఆర్ఎస్కు భయపడి వెనుకంజ వేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఎన్నికలకు ముందు దూకుడు మీదున్న బీజేపీ దగ్గర పడుతున్న కొద్దీ తిరోగమనం వైపునకు వెళ్తున్నది. రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా పాలమూరు నుంచే ప్రారంభించినప్పటికీ తర్వాత పరిణామాలు పార్టీని కొలుకోలేని దెబ్బతీశాయి. పార్టీలోకి ఇతర బలమైన లీడర్లను చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల పర్యటించారు. ఆశించిన స్థాయిలో నేతలేవరూ బీజేపీలో చేరలేదు. వనపర్తి జిల్లాలో జెడ్పీ చైర్మన్ను, ఇతర నాయకులను చేర్చుకోవడానికి ఈటల వచ్చినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ చేపట్టిన యాత్రలకు కూడా స్పందన రాకపోవడంతో రాష్ట్ర నేతలు ఖంగుతిన్నారు. మాజీ ఎమ్మెల్యే, ముదిరాజ్ నాయకుడు ఎర్రశేఖర్ పార్టీలో చేరి జిల్లా అధ్యక్షుడైనా ఆయనకు సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్నగర్ టికెట్ను ఆశించిన బీసీ నేతలకు ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్నగర్ టికెట్ విషయంలో సీనీయర్ నేతలు గుర్రుగా ఉన్నారు. మొత్తంపైన ఈ ఎన్నికల్లో సత్తాచాటుదామనుకున్న కమల నాథులకు గట్టిఎదురు దెబ్బలే తగులుతున్నాయి.