ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మూడు ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో 13 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ. లక్షా 76వేల నగదు ఆపహరణకు గురైంది.
కొత్తకోట,జనవరి 16: కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి కొత్తకోట పిపుల్స్ స్కూల్ సమీపంలోని జలందర్రెడ్డి ఇంట్లో 5తులాల బంగారు, 50వేల నగదు, రవీందర్రెడ్డి ఇంట్లో 20వేల నగదు, బీమన్న ఇంట్లో రెండు తులాల బంగారం,40తులాల వెండి, 20వేల నగదు, రాములు ఇంట్లో ఆరు తులాల బంగారం, రూ.6వేల నగదు చోరీ చేసినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నాగర్కర్నూల్టౌన్, జనవరి 16 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్నూరు ఫంక్షన్ హాల్ వెనక నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. తెలకపల్లిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మురళీమోహనాచారి ఈ నెల 12న ఇంటికి తాళం వేసి సంక్రాంతి పండుగకు రాయలసీమ ప్రాంతంలోని ప్రొద్దుటూరుకు వెళ్లారు. సోమవారం తెల్లవారు జామున తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి ఇల్లు తాళం తీసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నెల 12న దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అదే రోజు పట్టణంలో మరో రెండు ఇండ్లల్లో దొంగతనాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 6 తులాల బంగారం, 4కిలోల వెండి, రూ.80వేల నగదు చోరికి గురైనట్లు బాధితులు తెలిపారు.