ఖిల్లాఘణపురం, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసేందుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది అందులో భాగంగానే ఖిల్లాఘణపురం మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు పోలీస్ బందోబస్త్ మధ్య ఎన్నికల సామగ్రి ఈవీఎంలు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన అధికారులకు ఎన్నికల సామగ్రిని అందజేయగా వారివారి పోలింగ్ కేంద్రాలకు వివిధ వాహనాలతో తరలివెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ను పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.
గోపాల్పేట, నవంబర్ 29: గోపాల్పేట, రేవల్లి, మండలాల్లో బుధవారం పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. గోపాల్పేట మండలంలోని 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 132 మంది సిబ్బందిని నియమించినట్లు తాసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మొత్తం 31, 277 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రేవల్లి మండలంలో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 80మంది సిబ్బందిని నియమించినట్ల్లు తాసీల్దార్ లక్ష్మీదేవి తెలిపారు. 17, 830 మంది ఓటుహక్కును వినియోగించు కోనున్నట్లు ఆమె తెలిపారు.