ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పునఃప్రారంభమయ్యాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో ఊరట లభించింది. దీంతో పీఆర్ఎల్ఐ అన్ని ప్యాకేజీల్లో పనులు ఊపందుకున్నాయి. ఉగాది తర్వాత పూర్తిస్థాయిలో పనులు జరుగనున్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తికాగా, ఎండాకాలంలోగా మెయిన్ వర్క్స్ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాలకు తాగునీరందే పనులు ప్రారంభం కావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మహబూబ్నగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ స్టేతో పీఆర్ఎల్ఐ పనులకు అడ్డంకులు తొలగాయి. ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పీఆర్ఎల్ఐ పథకాన్ని చేపడుతున్నది. రూ.35కోట్ల వ్యయంతో నిర్మించే పథకాన్ని తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 2015 జూన్ 11న భూత్పూర్ మండలం కర్వెన వద్ద శంకుస్థాపన చేశారు. ఈ భారీ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం బ్యాక్వాటర్కు వరద వచ్చినప్పుడు సుమారు 70టీఎంసీలు ఎత్తిపోస్తుంది.
నాగర్కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్, వట్టెం, మహబూబ్నగర్ జిల్లాలోని ఉదండపూర్, కర్వెన, రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి వద్ద భారీ రిజర్వాయర్లు నిర్మించి నీరు నిల్వ చేస్తారు. అక్కడినుంచి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలోని 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉన్నది. ఈ మూడు జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీరు అందిస్తారు. పారిశ్రామిక అవసరాలకు కూడా జలాలను కేటాయించనున్నారు. అయితే కొంతమంది ఏపీ రైతులతో కలిసి ఎన్జీటీని ఆశ్రయించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500కోట్ల జరిమానా విధించడమే కాకుండా పనులను నిలిపివేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఊరట లభించింది. అన్ని ప్యాకేజీల్లో పనులు ఊపందుకున్నాయి. ఉగాది తర్వాత పూర్తిస్థాయిలో పనులు చేయనున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు అంటున్నారు.
మారనున్న ఉమ్మడి పాలమూరు స్వరూపం
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉమ్మడి జిల్లా స్వరూపమే మారుతుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడంతో ఇప్పటికే సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా మరింత సాగులోకి వచ్చి జిల్లాల స్వరూపమే మారుతుంది. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి.. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని ఎత్తిపోస్తారు. వానకాలంలో సుమారు 60రోజులపాటు వచ్చే వరద జలాలను దృష్టిలో ఉంచుకొని నిత్యం 1.5టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. సుమారు 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు.
శ్రీశైల జలాశయం సముద్రమట్టానికి 270 మీటర్ల ఎత్తున ఉంది. కొందర్గు మండలం లక్ష్మిదేవిపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్ ఎత్తు సుమారు 670మీటర్లు. ఈ ఎత్తువరకు ఏడు దశల్లో నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించేందుకే డిజైన్ చేశారు. సుమారు 60శాతం పనులు పూర్తయ్యాయని అసెంబ్లీ సాక్షిగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు. ఉదండపూర్ వద్ద సొరంగం పనులు పూర్తయ్యాయి. కాల్వలను తవ్వుతున్నారు. ఎల్లూరు(అంజనగిరి) రిజర్వాయర్ పనులు 70శాత పూర్తయ్యాయి. బండ్ రైజింగ్ పనులు సాగుతున్నాయి. వట్టెం వద్ద బండ్ పనులు 70శాతం పూర్తయ్యాయి. కర్వెన వద్ద 80శాతం పనులు పూర్తి కాగా.. రివిట్మెంట్ పనులు నడుస్తున్నాయి. ఉదండాపూర్ వద్ద 50శాతం పనులు పూర్తయ్యాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.