ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించడం జరుగుతుంది. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల ఎంపిక పూర్తైంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకుంటారు. పంచాయతీరాజ్ శాఖ నిబంధనల మేరకు గ్రామాల్లో అభివృద్ధి, వేసవిలో తాగునీటి సరఫరాలాంటి అంశాల్లో సమస్యలు కలగకుండా చర్యలు తీసుకుంటాం.
నాగర్కర్నూల్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో ప్రథమ పౌరులైన సర్పంచుల పాలన బుధవారంతో ముగిసింది. ఈనెల 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులు అజమాయిషీ చేయనున్నారు. ప్రజాప్రభుత్వంగా చెప్పుకొంటూ ముందుకు సాగుతున్న సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెనుకంజ వేసింది. రాజకీయ ఉద్దేశంతో ఎన్నికలను పక్కనపెట్టి అధికారులతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధిపై తాజాగా మాజీలవుతున్న సర్పంచులతోపాటు ప్రజల్లోనూ భయాందోళన నెలకొన్నది.
గ్రామాలు ఇక ప్రత్యేకాధికారుల పాలన కిందకి రానున్నాయి. ఐదేండ్లుగా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచుల స్థానంలో అధికారులు పరిపాలించబోతున్నారు. చివరగా 2019లో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహించడానికి విముఖత చూపింది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మారింది. కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలు గతంలో లే నంతగా అభివృద్ధి సాధించాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు, నూతన పంచాయతీ భవనాలు, భూగర్భ డ్రేనేజీలు, మురుగు కాల్వల నిర్మాణం, తండా లు పంచాయతీలుగా మారడం, కొత్త పంచాయతీల ఏ ర్పాటుతో ఎంతో అభివృద్ధి చోటు చేసుకున్నది. అదే వి ధంగా వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డం పింగ్ యార్డు, రైతు వేదికల నిర్మాణాలు జరిగాయి. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధ జలం అందుతోంది. ఫలితంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రత్యేకంగా నిలిచింది. ఈ క్రమంలో చేపడుతూ వచ్చిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉ న్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులను ముందుకు సాగిస్తుందనే నమ్మకం తాజా సర్పంచులతోపాటు ప్రజల్లోనూ ప్రశ్నార్థకంగా మారింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ సంఖ్యతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు సాహసించలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. గ్రామా ల్లో చేపట్టిన అభివృద్ధితో బీఆర్ఎస్పై ప్రజల్లో ఇంకా ఆదరణ చెక్కు చెదరలేదు. దీంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తే గర్వ భంగం కలుగుతుందని, తద్వారా పార్లమెంట్ ఎ న్నికలపై ప్రభావం పడుతుందనే అనుమానం ప్రభుత్వ పెద్దల్లో ఏర్పడి ప్రత్యేకాధికారులతో ముందుకు సాగేలా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి గ్రా మాల్లో ప్రథమ పౌరులైన సర్పంచుల స్థానంలో ప్రత్యేకాధికారులు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంపీడీవోలు పంచాయతీరాజ్ శాఖకు సిద్ధం చేసిన అధికారుల జాబితాను పంపించారు. ఫలితంగా గ్రామాలకు తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏవోలు, ఏఈలు, అంగన్వాడీ సూపర్వైజర్లు వంటి పలు శాఖల అధికారులను పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. ఇదే కోవలో సర్పంచుల నుంచి చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను తీసుకోనున్నారు. ఇప్పటి వరకు సర్పంచ్, ఉప సర్పంచులకు ఉన్న జాయింట్ పవర్ను ప్రత్యేకాధికారులు, కార్యదర్శులతో అనుసంధానించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడం, లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉన్నది. దీనికి ప్రజలచే ఎన్నుకోబడ్డ గ్రామ సభ కచ్చితంగా అవసరం ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్, పింఛన్, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో ప్రజల పాత్ర లేకుండా అధికారులే చేపడితే పారదర్శకత లోపించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ హయాంలో సర్పంచులతో కూడిన పాలక మండలి లేకుండా అధికారుల పరిపాలనలోకి తీసుకురావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో పెండింగ్ పనుల కొనసాగింపుతోపాటు అభివృద్ధిలో ముందు కు తీసుకెళ్లాలంటే పదవీ కాలాన్ని పొడిగిస్తే బాగుంటుందని సర్పంచులు, ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా శుక్రవారం నుంచి ఉమ్మడి పాలమూరులోని 1,692 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన రానున్నది.