మహబూబ్ నగర్ : రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చైర్ పర్సన్ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ తీర్మానం కాపీలను ప్రధాన మంత్రితో పాటు, సీఎం కేసీఆర్, కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రకి పంపనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగానికి మహర్దశపట్టిందన్నారు. దీంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడం లేదని చెప్పటం సరికాదన్నారు. పంజాబ్ లో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య ,జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు.