మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జడ్చర్ల, జూన్ 7 : గూడు లేని నిరుపేదలకు ప్రభు త్వం ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అందజేస్తున్నది. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం వందలాది గృహాలను నిర్మించి ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తాజాగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుట్ట వద్ద పేదల కలల సౌధాలను నిర్మించింది. గురువారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా వీటిని ప్రారంభించి అర్హులకు అందజేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 1560 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. 560 ఇండ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోనే వ్యాపార, వాణిజ్య కేంద్రంగా జడ్చర్ల పేరొందింది. హైవే-44, శ్రీశైలం, కోదాడ, రాయిచూర్ వంటి ప్రాంతాలకు కనెక్టివిటిగా ఉన్నది. మరోవైపు రైల్వే స్టేషన్, ఎక్కువగా బస్సులు నిలిపే ప్రయాణ ప్రాంగణం.. ఇలాంటి పట్టణంలో ఎవరైనా నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంతటి డిమాండ్ ఉన్న మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇండ్లు అంటే మాటలా..
ఎమ్మెల్యే లక్ష్మన్న సర్వే
డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చర్యలు చేపట్టారు. దరాఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికీ అధికారులతో కలిసి వెళ్లి సర్వే చేపట్టి వివరాలు తెలుసుకుంటున్నారు. వీరిలో ఇండ్లులేని నిజమైన అర్హులను ఎంపిక చేస్తున్నారు. జడ్చర్ల డబుల్ బె డ్రూం ఇండ్లకు భలే డిమాండ్ ఉన్నది. ఖరీదైన ప్రాం తంలో రెండు పడకల గదులను నిర్మించి ప్రభుత్వం అందిస్తుండడంతో లబ్ధిదారులు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఇం డ్లను నిర్మించారు.
కాంట్రాక్టర్లను, అధికారులకు సలహాలు, సూచనలు అం దిస్తూ.. పర్యవేక్షణతో పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో నేడు నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో డబుల్ ఇండ్లు నిర్మింపజేశారు. ప్రభుత్వం పేదలకు అందాలన్న లక్ష్యంతో నిర్మిస్తుండగా.. వాటిని అర్హుల చెంతకు చేర్చాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వార్డుల వారీగా సర్వే చేపట్టారు. ఇప్పటికే అందిన దరఖాస్తులను పరిశీలించి వారి ఇండ్ల వద్దకు వెళ్లి ఆర్థిక పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఎలాం టి విమర్శలకు తావు లేకుండా అర్హులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. నిత్యం ఉదయం 7 గంటలకే వార్డుల పర్యటన చేపడుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా పారదర్శక ఎంపికకు నడుం బిగించారు. ప్రజలిచ్చే అల్పాహారం భుజిస్తూ.. చాయ్లు తాగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దళారులకు చెక్
జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు డిమాండ్ ఉండటంతో పలువురు ఇండ్లను ఇప్పిస్తామని అమాయకులను మోసం చేసేందుకు యత్నించిన వాళ్లకు ఆగడాలకు చెక్ పడింది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లబ్ధిదారుల ఎంపికకు స్వయంగా రంగంలో దిగారు. వా ర్డుల వారీగా మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పర్యటిస్తూ లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా ఇల్లులేని పేదలకు గుర్తించి అక్కడికక్కడే ఇం డ్లను కేటాయించారు. జాగా ఉన్నోళ్లకు గృహలక్ష్మి పథ కం కింద అర్హులుగా ఎంపిక చేశారు. తాసీల్దార్ ఇప్పటికే లబ్ధిదారుల లిస్టును తయారు చేశారు. దీంతో ఇండ్ల పంపిణీలో ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండాపోయింది. మంత్రుల రాక కో సం జడ్చర్ల పట్టణం ముస్తాబైంది. ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది.
సొంతింటి కల సాకారం దిశగా..
పేదల సొంతింటి కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. గూడు లేక.. చాలీచాలని సంపాదనతో కుటుంబమే గడవని వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు బెడ్రూంలు, కిచెన్, హాల్, బాత్రూంలు కలిగిన ఇంటిని నిర్మించి ఇస్తున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఇంటి నిర్మాణాలకు చాలీచాలని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడంతో ఎందరో పేదలు అప్పుల పాలై ఇబ్బందులు పడ్డారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5.40 లక్షలను వెచ్చించి నిర్మిస్తున్నది. బాదేపల్లి ఎర్రగుట్ట సమీపంలో 560 ఇండ్లను నిర్మించారు. అలాగే కావేరమ్మపేటలో 120, బోయలకుంటలో 120, పాతబజార్లోని యాసాయకుంట రోడ్డులో 48, అలూరు రోడ్డులో 48, దళితవాడలో 9, మాధవరావు కాంపౌండ్లో8 నిర్మించారు. జడ్చర్ల రైతువేదిక సమీపంలో 500 ఇండ్లు ని ర్మిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1400 వందల ఇండ్లు నిర్మిస్తున్నారు.