చెత్తే కదా అని తీసి పడేయకండి.. ఇప్పుడు సిరులు కురిపించే సంపదగా మారింది. తడి, పొడి చెత్తతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తున్నారు. పర్యావరణ హితమే ధ్యేయంగా నారాయణపేట డంపింగ్ యార్డులో రూ.కోటితో యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బయోమైనింగ్ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. మున్సిపాలిటీలో నిత్యం 14 ఆటోలు, 4 ట్రాక్టర్లలో దాదాపు 200 మంది 20 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ప్రొక్లేయినర్ సాయంతో వడపోత మిషన్కు తరలించడంతో మొదటి దశలో ప్లాస్టిక్, రబ్బర్, రాళ్లు, మట్టి, బట్ట, గాజు, అట్ట ముక్కలు వేరవుతాయి. అక్కడినుంచి కంటేనర్లో రీసైక్లింగ్ యూనిట్కు తరలిస్తారు. రెండో దశలో కంకర, మూడో దశలో చిన్న ఇసుక రాళ్లను నిర్మాణ రంగానికి పంపించేలా సిద్ధం చేస్తారు. ఇలా వచ్చే మట్టితో ఎరువునూ తయారు చేస్తున్నారు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత వివిధ రకాల వస్తువుల తయారీ యూనిట్కు తరలిస్తున్నారు.
– నారాయణపేట, జూలై 7
నారాయణపేట, జూలై 7: పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతోపాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం డంపింగ్యార్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ యార్డులో వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను చేపడుతున్నారు. భారీ యంత్రాల సహాయంతో ప్రతి రోజూ 10 నుంచి 15 గంటల చొప్పున 10 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. వేరు చేసిన చెత్తను బయోమైనింగ్ పద్ధతిలో రీసైక్లింగ్ చేస్తూ పర్యావరణానికి హాని కలుగకుండా అదే చెత్తతో వివిధ రకాల వస్తువులను తయారు చేసేందుకు ఆయా తయారీ కేంద్రాలకు పంపిస్తున్నారు.
ప్రతి రోజూ 20 టన్నులు సేకరణ
నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో మొత్తం 8,500 ఇండ్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతి రోజూ వచ్చే చెత్తను పారిశుధ్య సిబ్బంది 14 ఆటోలు, 4 ట్రాక్టర్లలో సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దాదాపు 200 మంది కార్మికులు పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలో రోజుకు 20 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్యార్డులో ఒక చోట కుప్పగా పోస్తున్నారు.
ఎనిమిదెకరాల్లో రూ.కోటితో ఏర్పాటు
నారాయణపేట నుంచి పగిడిమారి గ్రామానికి వెళ్లే మార్గంలో మతామాణికేశ్వరి ఆశ్రమం సమీపంలో సుమారు ఎనిమిదెకరాల్లో రూ.కోటితో డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఎకరంలో ఫ్యాకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)తోపాటు ప్లాస్టిక్/రబ్బర్ ప్లాంట్, సెగ్రిగేషన్ షెడ్డు, డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ), కుక్కల కుటుంబ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఎనిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్/రబ్బర్ ప్లాంట్లో వ్యర్థాల నుంచి వచ్చే ప్లాస్టిక్ కవర్లు, రబ్బర్ల నుంచి క్లూడ్ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఇందులో రబ్బర్/ ప్లాస్టిక్ విభాగ బాధ్యతలను స్ట్రాటోస్ సంస్థ నిర్వహిస్తున్నది.
బయోమైనింగ్ పద్ధతిలో రీసైక్లింగ్
మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను డంపింగ్యార్డులో ప్రోక్లెయినర్ సహాయంతో కంటెయినర్లోని వడపోత మిషన్కు తరలిస్తారు. మొదటి దశలో ప్లాస్టిక్, రబ్బర్, రాళ్లు, మట్టి, బట్ట, గాజు, అట్ట ముక్కలు వేరవుతాయి. ఇలా వేరైన వస్తువులను కంటెయినర్తో రీ సైక్లింగ్ యూనిట్కు పంపుతారు. రెండో దశలో వచ్చే కంకర రాళ్లను నిర్మాణ రంగానికి పంపించేందుకు వేరుచేసి ఉంచుతారు. మూడో దశలో వచ్చే చిన్న ఇసుకరాళ్లను కూడా నిర్మాణ రంగానికి పంపించేందుకు సిద్ధం చేస్తారు. చివరగా వచ్చే మట్టితో ఎరువును తయారు చేస్తున్నారు. ఇలా పేట డంపింగ్యార్డులో వ్యర్థాల నుంచి ప్రాసెసింగ్ చేసి సేకరించిన వాటితో వస్తువులను తయారు చేసే యూనిట్లకు తరలిస్తున్నారు.
కలిసొచ్చిన అవగాహన
మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ చెత్త సేకరణ కోసం ఆకుపచ్చ, నీలిరంగు బకెట్లను అందజేశారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించి తడి చెత్తను ఆకుపచ్చరంగు బకెట్లో, పొడి చెత్తను నీలిరంగు బకెట్లో వేయాలని అధికారులు అవగాహన కల్పించారు. ఈక్రమంలో ప్రజలు ఇంటి వద్దకొచ్చిన ఆటోలకు చెత్తను అదేపద్ధతిలో అందిస్తున్నారు. తడి, పొడి చెత్త విషయాలపై మున్సిపల్ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడం బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.
కనిపించని చెత్త కుప్పలు
డంపింగ్యార్డు ఏర్పాటుకు ముందు వరకు నారాయణపేట మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్తను యాద్గీర్, సత్యనారాయణ ఆలయ రోడ్డు మార్గాల్లో ఊరి బయట రోడ్ల పక్కనే వేసేవారు. ప్రస్తుతం డంపింగ్యార్డు ఏర్పాటుతో ఊరిలో నుంచి వచ్చే చెత్తను తప్పనిసరిగా డంపింగ్యార్డుకు తరలిస్తుండడంతో రోడ్ల వెంట చెత్త కుప్పలు కనిపించడం లేదు.
అవగాహనతోనే సాధ్యమైంది
నేడు పట్టణం నుంచి వెలువడే ప్రతి వ్యర్థాన్ని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ఇండ్లు, వ్యాపార కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పారేయకుండా మున్సిపాలిటీ వారు అందజేసిన తడి, పొడి చెత్త బుట్టల్లోనే చెత్తను వేరు చేసి ఇండ్లు, వ్యాపార సముదాయల వద్దకు వచ్చే మున్సిపాలిటీ వాహనాల్లోనే వేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైంది. పాలకవర్గ, మహిళాసంఘాల సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలతోపాటు మున్సిపల్ సిబ్బంది ఇందుకు ఎంతో కృషి చేశారు. 24 వార్డులకు సంబంధించి చెత్త సేకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. ఇకపై కూడా పట్టణ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా తమ ఇండ్ల వద్దకు వచ్చే మున్సిపల్ ఆటోలు, ట్రాక్టర్లలోనే చెత్తను వేసి స్వచ్ఛ నారాయణపేటకు సహకరించాలి.
– మయాంక్ మిట్టల్, అదనపు కలెక్టర్, నారాయణపేట
స్వచ్ఛత దిశగా పేట మున్సిపాలిటీ
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ తెలంగాణలో భాగంగా నారాయణపేటలో పరిశుభ్రతకు పెద్దపీట వేశాం. ఇదివరకు పేట మున్సిపాలిటీకి డంపింగ్యార్డు ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డంపింగ్యార్డును ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకోసం ఎనిమిదెకరాల స్థలాన్ని సేకరించి రూ.కోటితో డంపింగ్యార్డు నిర్మించాం. ప్రతి రోజూ నారాయణపేట మున్సిపాలిటీ నుంచి వచ్చే 20 టన్నుల చెత్తను ప్రత్యేక వాహనాల్లో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. ఈ చర్యలతో పేట మున్సిపాలిటీ స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది.
– గందె అనసూయ , మున్సిపల్ చైర్పర్సన్, నారాయణపేట
‘మున్సిపల్’ పనితీరు అభినందనీయం
స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పేట మున్సిపాలిటీలో ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్న ఇంటింటా చెత్తను తడి, పొడి చెత్తగా వేర్వేరుగా సేకరిస్తూ మెరుగైన పారిశుధ్య చర్యలకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఇందుకోసం కృషి చేస్తున్న పారిశుధ్య సిబ్బంది, మున్సిపల్ అధికారుల పనితీరు ఎంతో గొప్పది. ఇండ్లు, దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్ల వెంట వేయకుండా నేరుగా మున్సిపాలిటీ ఆటోలు, ట్రాక్టర్లలోనే ప్రజలు వేస్తున్నారు. ఇకపై కూడా పారిశుధ్య నిర్వహణలో ఇదే పద్ధతిని కొనసాగిస్తూ స్వచ్ఛతలో నారాయణపేటకు అవార్డు తీసుకురావాలి. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం.
– ఎస్.రాజేందర్రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట