అమ్రాబాద్, అక్టోబర్ 19 : బీఆర్ఎస్ పాలనతోనే నల్లమల ప్రాంతం అభవృద్ధి జరుగుతుందని, మూడో సారి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం అమ్రాబాద్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్ననూర్, వెంకటేశ్వర్లబావి, తుర్కపల్లి, మాచారం, జంగంనెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తిరిగి ఓటర్లను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీలేదని, తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు కనపడుతుందన్నారు. కాంగ్రెస్ నేటికీ అభ్యర్థులను ప్రకటించకుండా టికెట్లను అమ్ముకొనే పనిలోనే ఉందని, టికెట్లను అమ్ముకొనే వారు రాష్ర్టాన్ని సైతం అమ్ముకోరన్న గ్యారెంటి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు దీనిని గమనించాలని తమ అమూల్యమైన ఓటును రాష్ర్టాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న బీఆర్ఎస్, కారు గుర్తుకు వేసి మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
స్థానికులం అని చెప్పుకొనే స్థానిక ప్రతి పక్షనేత వరుసుగా 4 సార్లు ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం నుంచి నల్లమల ప్రాంతం గుండా నల్గొండకు స్వరంగమార్గాన తీసుకెళ్లన ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్కు అప్పటి ఈ ప్రాంతం కాంగ్రెస్ నేత డబ్బుల సంచులు తెచ్చుకొని ఈ నల్లమలకు అన్యాయం చేశారని ఆరోపించారు. నల్లమలకు త్వరలో లిఫ్టు ద్వారా సాగునీటిని అందించి అచ్చంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అధికారం కోసం అలివి కాని హామీలు ప్రకటించింది కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ మాత్రం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. అదేవిధంగా ఈనెల 26న అచ్చంపేటకు సీఎం కేసీఆర్ రానున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం మన్ననూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు పదిమంది ఎమ్మెల్యే గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి, చెన్నకేశవులు, సర్పంచులు శ్రీరాంనాయక్, శారద, రాజారాం, జావెద్, ఎంపీటీసీలతోపాటు పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
అచ్చంపేట, అక్టోబర్ 19 : అమ్రాబాద్ మండలం ఎల్మపల్లిలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో భాగంగా ఆ గ్రామానికి వెళ్లగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ సొంత గ్రా మమైన ఎల్మపల్లిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మరింత ఆదరణ కనిపించడంతో బీఆర్ఎస్ శ్రేణులలో జోష్ నింపింది. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి అందరినీ పేరుపేరున పలకరించి తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణ వచ్చిన తరువాతే గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యేకు వివరించగా ఈ సారి అమ్రాబాద్ గడ్డకు సాగునీరు తీసుకువచ్చి రైతుల పాదాలు కడుగుతానని ఎమ్మెల్యే ప్రకటించగా గ్రామస్తులు మద్దతు తెలిపారు. మాకు పార్టీలు ముఖ్యం కాదని అభివృద్ధి చేసేవారికే అండగా ఉంటామని గ్రామస్తులు సంకేతం ఇచ్చారు. గ్రామంలో ఎమ్మెల్యేకు మంచి ఆదరణ లభించింది. సీఎం కేసీఆర్ను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పథ కాల ద్వారా లబ్ధిపొందుతున్న వారందరూ కేసీఆర్కు అండగా నిలబడాలని ఎమ్మెల్యే కోరారు.