కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గంలో 14 రౌండ్లపాటు కౌంటింగ్ ఉండనున్నది. నారాయణపేట సెగ్మెంట్లో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేయగా.. అక్కడి నుంచే తొలి ఫలితం వెలువడే అవకాశం ఉన్నది. గద్వాల, కల్వకుర్తి ఫలితాలు ఆలస్యంగా తెలియనున్నట్లు సమాచారం. ఎన్నికల కౌంటింగ్ జరిగే మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. 12 సెగ్మెంట్లలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 173 మంది పోటీ చేశారు. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొనగా.. మరికొన్ని చోట్ల ముఖాముఖి పోటీ ఉన్నది. అయితే, చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. గులాబీ శ్రేణులు మాత్రం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ షురూ అయ్యింది. ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహబూబ్నగర్ లోని పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నారాయణపేటలోని శ్రీ దత్త బీఈడీ కాలేజ్లో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు, గద్వాలలోని పాలిటెక్నిక్ కాలేజీలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు, వనపర్తి సమీపంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో వనపర్తి నియోజకవర్గం, నాగర్కర్నూల్లోని నెల్లికొండి వద్ద ఉన్న అగ్రికల్చర్ కాలేజీలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగనున్నది.
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవనుండగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 14 రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తారు. 12 నియోజకవర్గాల్లో తొలి ఫలితం నారాయణపేట నియోజకవర్గం నుంచి వెలువడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కేవలం ఏడుగురు అభ్యర్థులే బరిలో నిలిచారు. ఇక గద్వాల, కల్వకుర్తి నియోజకవర్గం ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలను ఉపయోగించారు. మిగతా నియోజకవర్గాల్లో నోటాతో కలిపి ఒక్కో ఈవీఎంను మాత్రమే ఓటింగ్కు ఉపయోగించారు. 15మంది అభ్యర్థుల ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. మధ్యాహ్నానికే ఎవరు గెలుస్తారనేది అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో మరోసారి సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయా జిల్లా ఎస్పీలు ప్రకటించారు. అనుమతి లేనిది ర్యాలీలు నిర్వహించరాదని పోలీస్ యంత్రాంగం సూచించింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల హెడ్క్వార్టర్లలో సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన పాస్లు ఉన్న కౌంటింగ్ ఏజెంట్లకు అనుమతిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ను కౌంటింగ్ సూపర్వైజర్లు దగ్గరుండి మానిటరింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను ఆయా సెగ్మెంట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఎన్నికల పరిశీలకులు అబ్జర్వ్ చేస్తారు. ఏజెంట్ల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి ఈవీఎంలలో ఎన్ని ఓట్లు ఎవరికి పోలయ్యాయి అనే వివరాలను వారికి చూయించి రికార్డు చేస్తారు. ఆ తర్వాత 14 టేబుళ్లలో లెక్కించిన ఓట్లను ఒక రౌండ్గా పరిగణించి విడుదల చేస్తారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్లలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులను సెంటర్లలోని ప్రత్యేక గ్యాలరీలో కూర్చోబెట్టి వారి పర్యవేక్షణలో ఓట్లను లెక్కిస్తారు.
మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఆయా జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పోలీసు దళాలను కూడా రంగంలో దింపి ఎస్పీలు భద్రతను పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రం రెండు కిలోమీటర్ల రేడియస్లో గుంపులుగా ఉండకుండా నిషేధాజ్ఞలు విధించారు. ప్రతి కౌటింగ్ సెంటర్లో మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు అందజేసేలా ఏర్పాటు చేశారు.
12 సెగ్మెంట్లలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 173 మంది పోటీ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనగా మరికొన్ని నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీ నెలకొంది. ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ దృష్ట్యా జిల్లా కేంద్రాల్లోని అన్ని హోటళ్లు లాడ్జీలు, కౌంటింగ్ కేంద్రాల సమీపంలోని ప్రదేశాలను ముందుగానే ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు బుకింగ్ చేసుకుని శనివారం రాత్రికి అక్కడికి చేరుకున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు టీవీల్లో వీక్షించేందుకు, ఆన్లైన్లో అప్డేట్స్ తెలుసుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కౌంటింగ్ ప్రక్రియకు కొన్ని గంటలే ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కాగా నారాయణపేట సెగ్మెంట్లో కేవలం ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా నోటాతో కలిపి 8. కల్వకుర్తిలో 24మంది అభ్యర్థులతోపాటు నోటాతో కలిపి 25, గద్వాలలో 20మంది అభ్యర్థులు, నోటాతో 21మందివి లెక్కించాల్సి ఉంటుంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లోనూ 2018 ఫలితాలే వస్తాయని బీఆర్ఎస్ నాయకులు ధీమాతో ఉన్నారు. అనేక సెగ్మెంట్లలో బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ అనేక కుయుక్తులను పన్నింది. కులాలు, వర్గాలు, మతాలవారీగా ఓటర్లను చీల్చింది. దీంతో ఆయా వర్గాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని అర్థం చేసుకొని గులాబీ పార్టీకి విజయాన్ని కట్టబెడుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాతో ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ యథావిధిగా కొనసాగుతాయని, ప్రజలంతా తమ పార్టీని ఆశీర్వదిస్తున్నారని మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.