మహబూబ్నగర్ సిగలోకి మరో మణిహారం చేరనున్నది. పాలమూరు-చించోళి జాతీయ రహదారి ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ, కర్ణాటకను కలిపేలా 108కి.మీ. హైవే-167ను విస్తరించాలని ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖకు పలుమార్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విన్నవించారు. దీనికి సానుకూలంగా రూ.706.08 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్లో పనులు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం సర్వే పనులు శరవేగంగాసాగుతున్నాయి. పాలమూరు బైపాస్కు అనుసంధానంగా ఈ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రయాణం మరింత సాఫీగా సాగనుండగా.. ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
మహబూబ్నగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జిల్లాకు మరో బైపాస్తో పాటు జాతీయ రహదారి మంజూరైంది. ఇప్పటికే చుట్టూ రెండు జాతీయ రహదారుల అనుసంధానం మొదలైన తరుణంలో మరో జాతీయ రహదారికి అంకురార్పణ పడింది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అనేక సార్లు ఢిల్లీ వెళ్లి తెలంగాణ, కర్ణాటకలను కలిపే మరో మార్గాన్ని జాతీయం చేసి రహదారిని నిర్మించాలని చేసిన విజ్ఞప్తికి ఎట్టకేలకు స్పందించారు. సుమారు రూ.700కోట్ల వ్యయంతో నిర్మించే జాతీయ రహదారికి గ్రీన్సిగ్నల్ పడింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో డిసెంబర్లో పనులు ప్రారంభం కానున్నాయి. మహబూబ్నగర్ నుంచి హన్వాడ మీదుగా కోస్గి, కొడంగల్, తాండూర్ మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు రహదారిని విస్తరిస్తున్నారు. ఈరహదారి పూర్తయితే మహబూబ్నగర్తో పాటు హన్వాడ మండల రూపురేఖలు మారిపోతాయి. బైపాస్ను కూడా అనుసంధానించడంతో ధర్మాపూర్ శివారు నుంచే జిల్లా కేంద్రంలోకి భారీ వాహనాలు రాకుండా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఏనుగొండ వద్ద నిర్మించిన బైపాస్ వల్ల రాయిచూర్, గోవాలాంటి దూర ప్రాంతాలకు సునాయాసంగా భారీ వాహనాలు వెళ్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్, కోదాడ, నల్గొండకు రవాణ సౌకర్యం పెరిగింది. ఈ రహదారి అనుసంధానం అయితే హన్వాడ నుంచి ఇటు జడ్చర్ల రూట్లో మరో బైపాస్కు మంత్రి అధికారులతో కలిసి ప్లాన్ సిద్ధం చేశారు. ఇది కూడా పూర్తయితే మహబూబ్నగర్ చుట్టుపక్కల ఔటర్ రింగ్రోడ్డుగా మారుతుంది.
108 కిలోమీటర్లు…రూ.706.08 కోట్లు
మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారి నెంబర్ -167ను విస్తరించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేసిన విజ్ఞప్తితో కదిలిన జాతీయ రహదారుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం రూ.706.08 కోట్ల వ్యయంతో దీన్ని విస్తరిస్తున్నారు. తెలంగాణ రహదారుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల శాఖ అధికారులు కలిసి మొత్తం 108 కిలోమీటర్ల రహదారిని విస్తరించాలని ప్రతిపాదించారు. గతంలో మహబూబ్నగర్ నియోజకవర్గం వరకు రహదారిని మెయింటెనెన్స్ చేసినా కొడంగల్ నియోజకవర్గంలో రహదారిని పట్టించుకోలేదు. దీంతో కోస్గి, కొడంగల్, తాండురు వెళ్లాలంటే ప్రయాణం మానుకోవాల్సిన దుస్థితి వచ్చేది. గతంలో ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పట్టించుకోకపోవడంతో రహదారి మరింత అధ్వాన్నంగా మారింది.
మారనున్న హన్వాడ రూపురేఖలు
మహబూబ్నగర్ సమీపంలో హన్వాడ -కొడంగల్ రహదారి సరిగా లేకపోవడంతో రవాణ వ్యవస్థ చిన్నభిన్నం అయింది. ప్రస్తుతం జాతీయ రహదారి రావడంతో హన్వాడ మండలం రూపురేఖలు మారుతున్నాయి. బైపాస్ అనుసంధానిస్తుండటంతో మండల కేంద్రమే మెయిన్ జంక్షన్గా మారనున్నది. జాతీయ రహదారితో భూముల ధరలు చుక్కలనంటాయి. జాతీయ రహదారి అనుసంధానమైతే ఇక్కడ కూడ పెద్ద హోటల్స్, వెంచర్లు పడే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పూర్తయితే సాగునీరు, తాగునీరుకు ఢోకా ఉండదు.
వేగంగా జాతీయ రహదారి విస్తరణ
మహబూబ్నగర్ -తాండురు రహదారిని విస్తరించాలని ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేశాం. మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. టెండర్లు పూర్తయ్యాయి. పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించాం. ఈరహదారి పూర్తయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం చుట్టుపక్కల అన్ని జాతీయ రహదారులు వచ్చినట్లవుతుంది. హన్వాడ మండలంతో పాటు జిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడ్తాయి. ఇప్పుడున్న బైపాస్కు, చించోలి బైపాస్కు అనుసంధానిస్తూ మరో బైపాస్ జడ్చర్ల రహదారికి కలిపితే పాలమూరు చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు తయారవుతుంది. దీన్ని కూడా పరిశీలిస్తున్నాం.
– శ్రీనివాస్గౌడ్,పర్యాటక శాఖ మంత్రి