చింతకాని, ఆగస్టు 10 : ‘తన పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఓ రైతు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ఆవేదనను తట్టుకోలేక తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
నాగులవంచ గ్రామానికి చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జునరావుకు అదే గ్రామంలోని సర్వే నంబర్ల పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పకనే మరికొందరు రైతుల పొలాలు ఉన్నాయి. పూర్వ కాలం నుంచి వీరి పొలాల మధ్య మీదుగా ఒక చిన్న డొంక దారి మాత్రమే ఉండేది. అయితే ఈ దారిని కాస్త పెద్దగా మార్చేందుకు మతేపల్లి మారెట్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అంబటి వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు పూనుకున్నారు. బాధిత రైతు పట్టా భూమిలోకి పొక్లెయిన్ తీసుకెళ్లి బలవంతంగా దారి వెడల్పు పనులు చేసేందుకు యత్నించగా.. రైతు మల్లికార్జునరావు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. దీంతో సదరు కాంగ్రెస్ నాయకులు తనను మాటిమాటికి బెదిరిస్తున్నారని రైతు ఆరోపించారు. ‘మా వెనక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార ఉన్నాడు.. ఏం చేసుకుంటావో చేస్కో.
నీపై తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసి నిన్నే లోపల వేయిస్తాం’ అని బెదిరించారని వాపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు మల్లికార్జునరావు.. తన పొలం వద్దే పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ‘నేను ఏమీ చేయలేక, ఒంటరినైపోయి ఈ పురుగుల మందుతాగి చచ్చిపోదాం అనుకుంటున్నా..’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన రైతును కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. స్లైన్ బాటిళ్లు ఎక్కించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
నాగులవంచ గ్రామంలో తమ కుటుంబానికి ఉన్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అయితే కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణంతో తమ బతుకులు రోడ్డున పడతాయని, ఆ ఆందోళనలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని బాధిత రైతు జొన్నలగడ్డ మల్లికార్జునరావు వాపోయాడు. తమ పొలాలకు వెళ్లేందుకు తమ పూర్వీకులు సొంతంగా వదులుకున్న మార్గం ఇది అని తెలిపారు. అయితే కాంగ్రెస్ నాయకుడు అంబటి వెంకటేశ్వర్లు, మరికొందరు కలిసి తమ స్వప్రయోజనాల కోసం మా డొంక దారిని పెద్దగా విస్తరించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం ఉన్న డొంక మార్గం ద్వారా వర్షాకాలంలో పొలాల్లోకి వచ్చే వరద నీరు బయటకు వెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థం కోసం మట్టి పోసి రోడ్డును బాగా ఎత్తు చేస్తే.. వర్షాలు వచ్చినప్పుడు ఆ వరద నీరు ఎటు వెళ్లకుండా నేరుగా మా నాలుగెకరాల వ్యవసాయ భూమిలోనే నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంట మునిగిపోయి తీవ్రంగా నష్టపోతామని కన్నీటి పర్యంతమయ్యారు. ఎకడో వేయాల్సిన రోడ్డు నిర్మాణ నిధులను తెచ్చి ఇకడ ఖర్చు చేయాలని చూస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు, సమస్యలను గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
గతంలో ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని, కాంగ్రెస్కు ఓటు వేసినందుకే తనకు తగిన శాస్తి జరిగిందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం విదితమే. మళ్లీ ఆ ఘటన మరువకముందే నాగులవంచ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి అండ చూసుకుని రైతులపై దౌర్జన్యాలకు దిగుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.