గద్వాల అర్బన్, సెప్టెంబర్ 22 : చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం ఉన్న బొచ్చ, రవ్వ, బంగారుతీగ, రాగండి చేపల కోసం సర్కారు రూ.1.50 కోట్లు వెచ్చిస్తున్నది. గతనెల చివరి నుంచి చేపపిల్లల పంపిణీ చేపట్టగా.. ఇప్పటికే ర్యాలంపాడు, తాటికుంట, ముచ్చోనిపల్లి, గుడ్డెందొడ్డి, నాగర్దొడ్డి, సంగాల తోపాటు పలు చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించగా.. జలకళ సంతరించుకోవడంతో మీనం మెరిసి మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. కొన్నేండ్లుగా ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ, ఆర్థికంగా ఆదుకునేందుకు 60 నుంచి 75 శాతం సబ్సిడీపై వలలు, వాహనాలు అందజేస్తుండడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో నెర్రలు బారిన నేలలతో చుక్క నీరు లేక చెరువులు ఎండుముఖం పట్టగా.. నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో జలకళను సంతరించుకొన్నాయి. దీంతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తున్నది. అంతేకాకుండా సబ్సిడీపై వాహనాలు, పడవలు, వలలు అందిస్తుండడంతో సంబురంగా చేపపిల్లలను పెంపొందించుకుంటూ ఆర్థికంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా చేపలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుబడి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది.
లక్షా 69వేల చేపపిల్లల విడుదల..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్ల్లో లక్షా 69వేల చేప పిల్లలను విడుదల చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. చేపపిల్లల కొనుగోలుకు ప్రభుత్వం రూ.కోటీ 50లక్షలకు పైగా మంజూరు చేసి ఖర్చు పెడుతున్నది. ఈ క్రమంలో 35-40 ఎంఎం, 80-100 ఎంఎం సైజు చేప పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. గత నెల ఆగస్టు 31వ తేదీ నుంచి జిల్లాలో చేపపిల్లల విడుదలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 8 రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు మత్స్యకారులకు అర్థికంగా అదుకునేందుకు 60 నుంచి 75 శాతం సబ్సిడీపై వలలు, వాహనాలు అందజేస్తున్నారు. చెరువుల పునరుద్ధ్దరణకు చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ సంతరించుకోగా, మీనం మెరిసి మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
పుష్కలంగా నీళ్లు..
సీఎం కేసీఅర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వంద శాతం సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. చెరువులు, కుంటల పునరుద్ధరణకు మిషన్ కాకతీయతో పునరుజ్జీవం పోసింది. దీంతో కాలంతో సంబంధం లేకుండా కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలోకి పుష్కలంగా నీరు చేరడంతో జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఇటీవల వరుస వానలతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి.
రెండు సైజులు.. నాలుగు రకాలు
జిల్లాలోని 300 పైగా కుంటలు, చెరువులు, రిజర్వాయ ర్లు, నదులు ఉన్నాయి. వీటిలో చేప పిల్లలను వదిలేందుకు నిధులు కేటాయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రస్తుతం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. రెండు రకాల చేప పిల్లలను కొనుగోలు చేశారు. వీటిలో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజ్ ఉన్న పిల్లలు, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం చేప పిల్లలు 1.69 లక్షలకు గానూ రూ.కోటీ 50లక్షలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. వీటిలో బొచ్చ, రవ్వ, బంగారుతీగ, రాగండి చేప పిల్లలు ఉన్నాయి. ర్యాలంపాడు, తాటికుంట, ముచ్చోనిపల్లి, గుడ్డొందొడ్డి, నాగర్దొడ్డి, సంగాలతోపాటు పలు చెరువుల్లో ఇప్పటికే చేప పిల్లలను విడుదల చేశారు. మిగతా చెరువుల్లో వదిలేందుకు అధికారులు వేగంవతంగా ప్రక్రియ మొదలు పెట్టారు.
ప్రభుత్వ సాయం..
మత్స్యకారులు చేపలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణంతోపాటు అవసరమైన వస్తువులను సమకూరుస్తోంది. జిల్లాలో 80పైగా మత్స్యకారుల సంఘాల అధ్వర్యంలో దాదాపు 6వేల పైగా మత్స్యకారులు ఉన్నారు. వీరు చేపల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నారు. మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం వాటిని విక్రయించేందుకు సబ్సిడీపై వాహనాలు ఇతర ఉపకరణాలు అందిస్తున్నది. సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 75శాతం సబ్సిడీపై అనేక రకాల యూనిట్లను పంపిణీ చేశారు. వలలు, వాహనాలు తదితర వస్తువులను అందజేస్తున్నారు.
కోటీ 60లక్షల చేపపిల్లల పంపిణీ..
జిల్లాలో కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్లు నీటితో కళకళలాడుతున్నాయి. చేపపిల్లల పంపిణీకి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు 31వ తేదీ నుంచే జిల్లాలో చేపపిల్లల పంపిణీ ప్రారంభించాం. 300పైగా చెరువుల్లో కోటీ 69 లక్షల చేప పిల్లలను రూ.కోటీ 50లక్షలకు పైగా నిధులతో కేటాయించి పంపిణీ చేస్తున్నాం. ఈనెల చివరి నాటికి జిల్లావ్యాప్తంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎస్.షకీలభాను, జిల్లా మత్స్యశాఖ అధికారి